ప్రెస్ కాన్ఫరెన్స్లో జర్నలిస్టును బూతులు తిట్టిన జో బైడెన్: మైక్రో ఫోన్లో రికార్డ్
వాషింగ్టన్: అగ్రరాజ్యానికి అధ్యక్షుడైనా తనకు భావోద్వేగాలు, ఆగ్రహావేశాలు, అసహనం ఉంటుందని జో బైడెన్ నిరూపించుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్న తరువాత ఆయన ఎమోషన్ అయ్యారు. ప్రమాణ స్వీకారం చేయడానికి తన స్వస్థలం డెలావర్లోని విల్మింగ్టన్ నుంచి బయలుదేరి వెళ్లడానికి ముందు ఏర్పాటుచేసిన సభలో స్థానికులను ఉద్దేశించి ప్రసంగించే సమయంలో భావోద్వేగానికి గురయ్యారు.
అసహనానికి గురైన బైడెన్
ఆ తరువాత- కరోనా వైరస్ మరణాల విషయంలోనూ ఆయన మీడియా సమక్షంలోనే ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా జో బైడెన్.. తన అసహనాన్ని, ఆగ్రహాన్ని వెల్లగక్కారు. కాస్త ఇబ్బందికరమైన ప్రశ్నను సంధించిన జర్నలిస్ట్ను ఉద్దేశించి బూతులు తిట్టారు. ఆయన తనలో తానే ఈ బూతు మాటను బయటపెట్టుకున్నప్పటికీ- హాట్ మైక్లో అది రికార్డయింది. అందరికీ వినిపించింది. ఆ పదాన్ని జర్నలిస్టులు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
ధరల నియంత్రణపై..
రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని నివారించడానికి అమెరికా తీసుకున్న చర్యలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలను వివరించడానికి జో బైడెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేశారు. ద్రవ్యోల్బణం, ధరల నియంత్రణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను ఆయన వెల్లడించాల్సి ఉంది. తన అధికారిక నివాసం వైట్హౌస్లోని ఈస్ట్ రూమ్లో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటైంది. వైట్హౌస్ కార్యకలాపాలను కవర్ చేసే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున దీనికి హాజరయ్యారు.
ఫాక్స్ ఛానల్ కరెస్పాండెంట్కు..
ప్రెస్ కాన్ఫరెన్స్ దాదాపుగా ముగింపుదశకు వచ్చిన సమయంలో ఫాక్స్ ఛానల్ కరెస్పాండెంట్ పీటర్ డూసీ అడిగిన ప్రశ్న అది. దీనికి సమాధానం ఇవ్వలేకపోయారు జో బైడెన్. తీవ్ర అసహనానికి గురయ్యారు. దాన్ని దాచుకోలేకపోయారు. `ద్రవ్యోల్బణం మీద నేనొక ప్రశ్నను అడగబోతున్నాను..అని మొదలు పెట్టారు. ఈ మధ్యంతర కాలంలో ద్రవ్యోల్బణం ఏర్పడటానికి రాజకీయ స్థితిగతులు బాధ్యత వహించాల్సి ఉంటుందని భావిస్తున్నారా? అని సూటిగా ప్రశ్నించారు.
స్టుపిడ్ సన్ ఆఫ్ బిచ్..
దీనికి వెంటనే జో బైడెన్ బదులిచ్చారు. అదో గొప్ప ఆస్తి అని వ్యాఖ్యానించారు. ఆ కొద్దిసేపటికే `వాట్ ఎ స్టుపిడ్ సన్ ఆఫ్ బిచ్..` (What a stupid son of a bitch) అని తనలో తాను అనుకున్నారు. ఈ వాక్యాన్ని ఆయన గట్టిగా ఉచ్ఛరించలేదు గానీ.. అక్కడి హాట్ మైక్లో రికార్డయింది. దీన్ని వింటూనే ప్రెస్ కార్ఫరెన్స్ను ముగించుకుని వెళ్తున్న జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా నివ్వెరపోయారు.
Recommended Video
ద్రవ్యోల్బణం మీదే..
రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సంబంధాల మీద ఎలాంటి ప్రశ్నలు అడగొద్దంటూ జో బైడెన్ ముందే సూచించారని పీటర్ డూసీ తెలిపారు. ఈ అంశం మీద అమెరికా అంతర్గతంగా చర్చిస్తోందని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ పిసాకీ.. ఆ తరువాత వివరణ ఇచ్చారు. మంత్రివర్గంలో దీన్ని చర్చించలేదని, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలను అరికట్టడానికే ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని నియంత్రించడానికి అమెరికా దౌత్యం వహించినా..విఫలమైంది.