G20 సదస్సుకు జిన్ పింగ్ డుమ్మా ! హర్ట్ అయిన జో బైడెన్-తాను ఇండియా వస్తున్నట్లు వెల్లడి..
జీ20 దేశాల వార్షిక సదస్సుకు ఈ ఏడాది భారత్ అతిధ్యమిస్తోంది. న్యూఢిల్లీలో జరిగే ఈ సదస్సుకు జీ20 దేశాల అధినేతలు హాజరు కావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఈ పర్యటనకు హాజరు కావడం లేదు. దీనిపై అమెరికాతో పాటు పలు దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇదే క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా జిన్ పింగ్ రాకపోవడంపై ఘాటుగా స్పందించారు. తాను మాత్రం భారత పర్యటనకు ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.
జీ20 సదస్సు ఈ నెల 9-10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరగబోతోంది. దీని కోసం ఈ నెల 8నే భారత్ చేరుకోనున్న జో బైడెన్.. ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. అనంతరం బైడెన్ జీ20 సదస్సులో పాల్గొంటారు. ఇందుకోసం ఇప్పటికే ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఈ కీలక సదస్సుకు హాజరుకాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను మాత్రం జిన్ పింగ్ ను జీ20 సదస్సులో చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

మరోవైపు జీ20 సదస్సుకు జిన్ పింగ్ రావడం లేదని, ఆయన స్ధానంలో డిప్యూటీ ప్రధాని లీక్వెయాంగ్ హాజరవుతారని చైనా మీడియాలో వార్తలొచ్చాయి. అయితే తాము కూడా ఈ వార్తలనే చూశామని, కానీ చైనా నుంచి అధికారికంగా రాతపూర్వక స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు జీ20 ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ముక్తేష్ పరదేశీ వెల్లడించారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా జీ20 సదస్సుకు హాజరుకావడం లేదని ప్రకటించారు. ఆయన స్ధానంలో మంత్రి సెర్గోవ్ ను పంపుతున్నారు.
జీ20 సదస్సుకు భారత్ వస్తున్న వారిలో అమెరికా అధ్యక్షుడు బిడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా వంటి వారు ఉన్నారు. సెప్టెంబరు 10న బ్రెజిల్ అధ్యక్షుడు లూలాకు జీ20 అధ్యక్ష పదవిని మోదీ అధికారికంగా బదిలీ చేయబోతున్నారు. డిసెంబర్ 1న బ్రెజిల్ అధికారికంగా G20 అధ్యక్ష పదవిని చేపట్టనుంది. జీ20 సభ్య దేశాలు ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతనికి పైగా , ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.












Click it and Unblock the Notifications