అమెరికాలో ఘనంగా దీపావళి -వైట్ హౌస్ లో బైడెన్, కమల-ఇంట్లో ట్రంప్ వేడుకలు
దీపావళి వేడుకలు భారత్ లోనే కాదు విదేశాల్లోనూ మిన్నంటాయి. ముఖ్యంగా కరోనాతో రెండేళ్లు పండగలు, పబ్బాలకు దూరమైన జనం ఈసారి దీపావళి వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్ తో పాటు యూఎస్ లోనూ దీపావళి సంబరాలు ఘనంగా సాగాయి. ఇందులో అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు మాజీ అధ్యక్షులు కూడా పాలుపంచుకున్నారు.
తొలిసారిగా అమెరికా శ్వేతసౌధంలో అంగరంగ వైభవంగా దీపావళి రిసెప్షన్ వేడుకలు నిర్వహించారు. చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా వైట్ హౌస్లో అత్యధిక సంఖ్యలో ఆసియా అమెరికన్లు ఉన్నారు. బైడెన్ ప్రభుత్వంలో అత్యధిక సంఖ్యలో భారతీయ అమెరికన్లు ఉన్నారు. దీంతో దీపావళి వేడుకల్ని వైట్ హౌస్ లో నిర్వహించిన బైడెన్.. .. మీకు ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
వైట్హౌస్లో ఈ స్థాయిలో దీపావళి రిసెప్షన్ని నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ దీపావళి వేడుకను ఆమెరికా సంస్కృతిలో భాగం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. యూఎస్లో ఉన్న బిలియన్కు పైగా ఉన్న హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి వేడుకను ఆనందంగా జరుపుకున్నందుకు యూఎస్లోని ఆసియా అమెరికన్ కమ్యునిటీకి బైడెన్ కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు ఈ పండుగ సందర్భంగా దియాలను వెలిగించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడేల ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేలా అమెరికా అంతటా ఉన్న దక్షిణాసియా అమెరికన్లు కనబర్చిన తెగువ, సాహసాలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ దీపావళి వేడుక చీకటిపై వెలుగు సాధించిన గుర్తుగా ఈ పండుగను జరుపకుంటున్నామని, అలాగే ఈ వేడుకతో అమెరికా తోపాటు ప్రపంచమంతా జ్ఞాన కాంతుల వెలుగుతో నింపుదాం అని పిలుపునిచ్చారు. ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ మాట్లాడుతూ ఈ వైట్హౌస్ ప్రజల ఇల్లని, మా అధ్యక్షురాలు, ప్రథమ మహిళ జిల్ బైడెన్తో కలిసి ఈ సంప్రదాయ వేడకను జరుపకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అలాగే జిల్ బైడెన్ కూడా ఆసియా అమెరికన్ కమ్యూనిటీ మరింత ముందుకు వెళ్లేందుకు ఈ దీపావళి పండుగ సహకరిస్తోందన్నారు. అందర్నీ ఒకచోటకు చేర్చి సమానత్వాన్ని గుర్తు చేసేలా చేసుకునే పండుగా అని కొనియాడారు.
మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంట్లోనూ ఈసారి దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో రిపబ్లికన్ హిందూ సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ భారతీయులను ఉద్దేశ్యించి మాట్లాడారు. పలు భారతీయ సంఘాల ప్రతినిధులతో కలిసి శాస్త్రోక్తంగా దీపావళి వేడుకలను నిర్వహించారు. రిపబ్లికన్ హిందూ సమాఖ్య ప్రతినిధులు షల్లీ కుమార్, హరిభాయ్ పటేల్ తో పాటు తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనాదిగా చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని, సమస్త మానవాళి శాంతి సౌబ్రాత్రుత్వంతో మెలగాలని ఆకాంక్షిస్తూ ట్రంప్ దీప ప్రజ్వలన చేశారు. భవిష్యత్ లో భారత్ అమెరికా దౌత్య సంబంధాలు, పరస్పర సహాయ సహకారాలు ఉన్నతస్థాయిలో కొనసాగాలని ఆయన అభిలాషించారు. 2016 ఎన్నికలలో తన వెన్నంటి ఉండి బలపరచిన రిపబ్లికన్ హిందూ సమాఖ్య నాయకత్వానికి, సభ్యులకు ట్రంప్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే, హిందు సమాఖ్య సభ్యులను తన ప్రభుత్వ కార్య నిర్వహణలో కీలక భాగస్వాములను చేస్తామని తెలిపారు.
భారతదేశం ఎదుర్కోంటున్న పలు సమస్యలపై సానుకూల దృక్పథాన్ని అవలంబించి, సంయుక్తంగా టెర్రరిజం మూలాలను ఏరిపారేస్తామని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారతీయులు శాంతి కాముకులని, ఎలాంటి పరిస్థితులలో అయినా కష్టపడి, సానుకూల దృక్పథంతో ముందు సాగే వారి స్వభావమే వారికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టిందని అన్నారు. అమెరికాలో తమ మూలాలను కాపాడుకుంటూనే, అమెరికా అభివృద్దిలో కీల పాత్ర పోషిస్తున్నారని రిపబ్లికన్ హిందూ సమాఖ్య వ్యవస్థాపకుడు షల్లీ కుమార్ను, కార్యవర్గ సభ్యులు తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన ను ట్రంప్ ప్రత్యేకంగా అభినందించారు.