కాబుల్ నరమేధం వెనుక అలాంటి కుట్రకు నో ఛాన్స్: ప్రతీకారం తీర్చుకుంటాం: జో బైడెన్
వాషింగ్టన్: ఇస్లామిక్ దేశం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న మారణహోమం అన్ని దేశాలను ఉలిక్కి పడేలా చేసింది. భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్-ఖొరాసన్ ప్రావిన్స్ (ISIS-K) ఈ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో కాబుల్లో సంభవించిన మరో బాంబుదాడిలో 60 మది మరణించారు.
Recommended Video

తాలిబన్ల పాలనలోకి వెళ్లిన కొద్దిరోజుల్లోనే..
ఇన్నాళ్లూ అమెరికా, నాటో బలగాల చేతుల్లో ఒకింత సురక్షితంగా ఉంటూ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన అతి కొద్దిరోజుల్లోనే ఈ దాడులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాబుల్లో చోటు చేసుకున్న జంట పేలుళ్లకు తామే కారణమంటూ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. అదే సమయంలో దాడి జరిపేలా తాలిబన్లు వారికి సహకరించి ఉండొచ్చనే వార్తలు సైతం వెలువడ్డాయి. ప్రపంచ దేశాలకు- ప్రత్యేకించి అగ్రరాజ్యం అమెరికాకు ఓ హెచ్చరిక చేయడానికే ఈ మారణహోమానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

కుట్ర లేదంటూ..
కాబుల్లో చోటు చేసుకున్న ఈ వరుస ఘటనలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. దీని వెనుక తాలిబన్లు- ఇస్లామిక్ స్టేట్ కుట్ర ఉందంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో తాలిబన్లు చేతులు కలిపారనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలేవీ కనిపించట్లేదని స్పష్టం చేశారు. అలాంటి బలమైన ఆధారాలేవీ ఇప్పటిదాకా లభించలేదని అన్నారు. జంట పేలుళ్లను ఉమ్మడి దాడిగా భావించట్లేదని జో బైడెన్ తేల్చి చెప్పారు.

జో బైడెన్ సంతాపం..
కొద్దిసేపటి కిందటే ఆయన తన అధికారిక నివాసం వైట్హౌస్ వద్ద మాట్లాడారు. కాబుల్ జంట పేలుళ్లలో 13 మంది అమెరికా సైనికులు దుర్మరణం పాలయ్యారు. ఈ దాడులకు సంతాప సూచికంగా అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాస భవనం వైట్హౌస్పై ఉన్న జాతీయ పతకాన్ని అవనతం చేశారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు జో బైడెన్. ఈ జంటపేలుళ్లు సృష్టించిన మారణహోమానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

ప్రతీకారం తీర్చుకుంటాం..
తాలిబన్లకు కూడా ఇస్లామిక స్టేట్ దాడిపై ముందస్తుగా ఎలాంటి సమాచారం ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని జో బైడెన్ వ్యక్తం చేశారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP, ISIS-K) బాధ్యత వహించడంతో.. ఇక అమెరికా ప్రతీకారాన్ని తీర్చుకోవచ్చనే వార్తలను బలపరుస్తూ జో బైడెన్ ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. తాలిబన్లపై ప్రతీకారాన్ని తీర్చుకుంటామని, వారిని వెంటాడుతామని హెచ్చరించారు. దాడి కారకులను క్షమించే ప్రసక్తే లేదని అన్నారు.

మరిన్ని దాడులకు ఛాన్స్
ఇదిలావుండగా.. కాబుల్లో మరిన్ని దాడులు చోటు చేసుకునే ప్రమాదం ఉందంటూ అమెరికా, బ్రిటన్ హెచ్చరించాయి. ప్రత్యేకించి కాబుల్ విమానాశ్రయం వద్ద వేలాదిమందిగా గుమికూడిన ఆప్ఘనిస్తానీయులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు మరిన్ని దాడులకు పాల్పడొచ్చని పేర్కొన్నాయి. సాధారణ పౌరులు ఎవరూ విమానాశ్రయం చుట్టుపక్కలకు వెళ్లకూడదని సూచించాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తమ దేశాల ప్రజలకు ఈ హెచ్చరిక జారీ చేశాయి.

ఎయిర్పోర్ట్ టార్గెట్..
వేలాది మంది ప్రజలు కాబుల్ విమానాశ్రయం లోపల, బయట అఫ్గాన్ వదిలి వెళ్లడానికి ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చోటు చేసుకున్నాయి. ఇలాంటి మరిన్ని ఉంటాయని ఆయా దేశాలు పేర్కొన్నాయి. విమానాశ్రయం అబ్బే గేట్, ఈస్ట్ గేట్, నార్త్ గేట్ దగ్గర లోనికి వెళ్లడానికి పడిగాపులు పడుతోన్న వేలాదిమంది ప్రజలు తక్షణమే అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించిన కొన్ని గంటల తరువాత ఆస్ట్రేలియా సైతం అలాంటి ఈ ప్రకటనే జారీ చేసింది.












Click it and Unblock the Notifications