పుతిన్ను అంతం చేయండి; రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుంది.. అమెరికా సెనెటర్ సంచలన వ్యాఖ్యలు !!
ఉక్రెయిన్పై యుద్ధాన్ని రష్యా ఇప్పుడే ఆపేలా కన్పించడంలేదు. ప్రపంచ దేశాలు మొరపెట్టుకుంటున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. బాంబులతో దాడులను మరింత పెంచారు. దీంతో ఉక్రెయిన్లో ఎక్కడ చూసిన భయాందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ భవనాలు, నివాసప్రాంతాలను టార్గెట్ చేసుకుని రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి . రోడ్లపై వరుసగా శవాలు పేర్చినట్లు కన్పిస్తున్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకున్నారు. బంకర్లలో తలదాచుకుని జీవనం సాగిస్తున్నారు.
పుతిన్ను అంతం చేస్తేనే యుద్ధానికి ముగింపు
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా సెనెటర్ లిండ్సీ గ్రాహమ్ వివాదస్పవ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ను అంతం చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. ఓ టీవీ ఛానల్ సెనెటర్ లిండ్సీ గ్రాహమ్ను చేసిన ఇంటర్య్వూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఎలా ముగుస్తుందని సదరు ఛానెల్ ప్రశ్నించింది. దీని ఘాటుగా స్పందించిన ఆయన పుతిన్ను హత్య చేయాలని వ్యాఖ్యానించారు. అప్పుడే ఇరుదేశాల మధ్య యుద్ధం ఆగిపోతుందని పేర్కొన్నారు. రష్యాలోని పౌరులలో ఎవరో ఒకరు దీనికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలన్నా , పేదరికం నుంచి బయటపడాలన్నా పుతిన్ను హతమార్చడమే కరెక్ట్ అంటూ అమెరికా సెనెటర్ లిండ్స్ గ్రాహమ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా సెనెటర్ వ్యాఖ్యలు నేరమే..
అమెరికా సెనెటర్ లిండ్సీ గ్రాహమ్ వ్యాఖ్యలపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఒక దేశాక్షుడుని హతామర్చాలని పిలుపు ఇవ్వడం నేరమని అమెరికాలో రష్యా రాయబారి అనటోలి ఆంటోనోవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా సెనెటర్ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతోన్న ప్రస్తుత తరుణంలో రష్యన్లందరూ ఏకమై తమ అధ్యక్షుడు పుతిన్కు మద్దతు ఇవ్వాలని క్రెమ్లిన్ పిలుపునిచ్చింది.
అందరి భద్రతపై దాడి
అటు ఐరోపాలో అతిపెద్ద జాపోరిషియా అణు విద్యుత్ కేంద్రంపై రష్యా బలగాల దాడులను ప్రపంచదేశాలు ఖండిస్తున్నాయి. ఇది అందరి భద్రతపై దాడి అంటూ ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రాగి ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, అణు విద్యుత్ ప్లాంట్ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకోవడంపై రష్యన్లు నిరసనలు చేపట్టాలని ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్ స్కీ విజ్ఞప్తి చేశారు.1986లో చెర్నోబిల్ విపత్తుకు వ్యతిరేకంగా మనమంతా కలిసి పోరాడాం అని గుర్తు చేశారు.