జెరూసలెంలో ఏం జరుగుతోంది?
Hezbollah chief Hassan Nasrallah: లెబనాన్ యుద్ధానికి దిగింది. ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్పై విరుచుకుపడుతోంది. ఆ దేశ భూభాగంపై మిస్సైళ్లను సంధిస్తోంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించింది. జెరూసలెం సహా తమ దేశ భూభాగంపై పలు చోట్ల సైరెన్ మోతలు వినిపించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది.
లెబనాన్పై ఇజ్రాయెల్ సాగిస్తోన్న భీకర దాడులు మరో మలుపు తిరిగాయి. కొద్దిరోజులుగా ఏకధాటిగా కురిపిస్తోన్న మిస్సైళ్లు, శక్తిమంతమైన బాంబుల వర్షానికి హెజ్బొల్లా కకావికలమౌతోన్న విషయం తెలిసిందే. రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ సాగించిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా హతం అయ్యారు.

ఆయనతో పాటు సదరన్ ఫ్రంట్ కమాండర్ అలీ కర్కీ, ఇతర కమాండర్లు కూడా మృతిచెందారు. బీరుట్ దక్షిణ ప్రాంతంలోని దహియాలో గల హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడుల్లో వారిద్దరూ మరణించారు. ఈ విషయాన్ని హెజ్బొల్లా అధికారికంగా ధృవీకరించింది. ప్రతీకార దాడులు తప్పవనీ హెచ్చరించింది. దీనికి అనుగుణంగా కొన్నిగంటల్లోనే యుద్ధానికి దిగింది.
రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా లెబనాన్లో గల హెజ్బొల్లా స్థావరాలపై వైమాని దాడులను కొనసాగిస్తూ వస్తోంది ఇజ్రాయెల్. ఈ మిలిటెంట్ గ్రూప్ను నామరూపాల్లేకుండా చేయాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 1,000 మందికి పైగా మరణించారు. 6,000 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. 10 లక్షలమంది వరకు నిరాశ్రయులయ్యారు.

హసన్ నస్రల్లా కోసం జరిపిన దాడుల్లోనూ 33 మంది పౌరులు మరణించారు. 95 మంది గాయపడ్డారు. హసన్ నస్రల్లా మరణానంతరం ప్రతీకార దాడులకు దిగింది లెబనాన్. దీన్ని పవిత్ర యుద్ధంగా అభివర్ణించింది. అదే సమయంలో పాలస్తీనాకు సంపూర్ణ మద్దతును ప్రకటించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత లెబనాన్.. మిస్సైళ్లను సంధించింది.

జెరూసలేం, అబుదిస్, మాలె అదుమిన్, అల్-రమ్, అల్ ఫుకారా, అబు దహౌక్, హిజ్మా, అనట, కసరాట్ వంటి ప్రాంతాల్లో వార్ సైరన్ మోతలు వినిపించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది. కొన్ని చోట్ల లెబనాన్ మిస్సైళ్లను కూల్చివేసినట్లు పేర్కొంది. ఎలాంటి ప్రతీకార దాడులకైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది ఇజ్రాయెల్.












Click it and Unblock the Notifications