హోటల్ నుంచి లిబియా ప్రధాని జియాదన్ కిడ్నాప్
ట్రిపోలి: లిబియా ప్రధానమంత్రి అలీ జియాదన్ కిడ్నాప్కు గురయ్యారు. లిబియా రాజధాని ట్రిపోలిలోని ఓ హోటల్ నుంచి సాయుధులైన ముష్కరులు కిడ్నాప్ చేసినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ట్రిపోలిలోని హోటల్లో బస చేసిన అలీ జియాదన్ గురువారం ఉదయం అపహరణకు గురయ్యారని అధికారులు మీడియాకు చెప్పారు.
ప్రభుత్వ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రధాని అలీ జియాదన్ బస చేసిన ట్రిపోలిలోని విలాసవంతమైన హోటల్లోకి సాయుధులైన ముష్కరులు గురువారం ఉదయం ప్రవేశించారని తెలిపారు. ఆ తర్వాత ప్రధాని జియాదన్, ఇద్దరు రక్షకులను కూడా అపహరించినట్లు అధికారులు చెప్పారు.

ఆఫ్రికాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై 1998లో దాడులకు పాల్పడిన లిబియన్ ఉగ్రవాది అబూ అనాస్ అలీ-లిబీని అమెరికా సైనిక దళాలు దాడులు జరిపి పట్టుకున్నట్లు శనివారం వార్తలు వచ్చిన నేపథ్యంలో లిబియా ప్రధాని జియాదన్ కిడ్నాప్ జరగడం గమనార్హం.
కాగా ఉగ్రవాది అబూ అనాస్ అలీ లిబీని అమెరికా దళాలు పట్టుకోవడం కోసం లిబియా ప్రభుత్వం సహకరించిందని భావిస్తున్న ఉగ్రవాదులు ప్రధాని జియాదన్ కిడ్నాప్కు పాల్పడినట్లుగా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కిడ్నాప్కు ఒక రోజు ముందు బుధవారం ఉగ్రవాది లిబీ కుటుంబ సభ్యులను ప్రధాని జియాదన్ కలిశారు. అమెరికా దాడి గురించిన సమాచారం తనకు తెలియదని అమెరికా ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటామని ప్రధాని ఈ సందర్భంగా తెలిపినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications