భారత్లో అమెరికా రాయబారిగా జో బిడెన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్: వెనుక..పెద్ద వ్యూహమే
వాషింగ్టన్: కరోనా సంక్షోభం భారత్ను అతలాకుతలం చేస్తోంది. అల్లకల్లోలానికి గురి చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో నమోదవుతోన్న పాజిటివ్ కేసులతో ఆక్సిజన్ సహా వైద్య సదుపాయాల కొరతను ఎదుర్కొంటోంది. భారత్ను ఆదుకోవడానికి పలు దేశాల నుంచి సహాయ, సహకారాలు అందుతున్నాయి..అమెరికా సహా. ఈ పరిస్థితుల్లో అమెరికా రాయబారిగా ఓ రాజకీయ వ్యూహకర్త భారత్కు రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడన్ క్యాంప్లో కీలక నాయకుడాయన. త్వరలోనే ఆయనను భారత్లో అమెరికా రాయబారిగా పంపించే అవకాశాలు ఉన్నాయంటూ యూఎస్ మీడియా వెల్లడించింది.
ఆయన పేరు ఎరిక్ గార్సెట్టి. డెమొక్రటిక్ పార్టీలో కీలక నేత. జో బిడెన్కు కుడిభుజం లాంటివారు. గత ఏడాది ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేశారు. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ మేయర్గా ఉన్నారు. అమెరికాలో భారతీయులు అధిక సంఖ్యలో నివసించే నగరాల్లో ఇదీ ఒకటి. అమెరికాలో రెండో అతిపెద్ద నగరం. అలాంటి నగరానికి మేయర్గా, డెమొక్రటిక్ క్యాంపెయిన్లో కీలక నేతగా ఉన్న ఎరిక్ గార్సెట్టిని భారత రాయబారిగా పంపించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు యూఎస్ మీడియా అంచానా వేసింది.
అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ పగ్గాలను అందుకున్న తరువాత తొలిసారిగా ఈ మార్పు చోటు చేసుకోబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇండో-పసిఫిక్ రీజియన్లో ప్రస్తుతం చైనా నుంచి భారత్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. అటు సముద్ర జలాల వ్యవహారంలోనూ డ్రాగన్ కంట్రీ దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ విషయంలో భారత్ను అన్ని విధాలుగా అండగా నిలుస్తామంటూ ఇదివరకే అమెరికా సంకేతాలను పంపించింది. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే భారత్లో మకాం వేయాల్సి ఉంటుందనే ఉద్దేశంతో జో బిడెన్ ఉన్నారని మీడియా అభిప్రాయపడింది.