న్యూజిలాండ్ లో భూకంపం: వణికిపోయిన ప్రజలు
వెల్లింగ్టన్: నేపాల్ భూకంపం బాధితులు తేరుకుంటున్న సమయంలో మరో దేశంలో భూకంపం వచ్చింది. న్యూజిలాండ్ దేశంలో సోమవారం భూకంపం రావడంతో ఆ దేశ ప్రజలు హడలిపోతున్నారు. ముందు జాగ్రత చర్యగా న్యూజిలాండ్ అధికారులు తగిన జాగ్రతలు తీసుకుంటున్నారు.
సోమవారం న్యూజిలాండ్ లోని వనాక పట్టణానికి వాయువ్య దిశలోని 30 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చిందని న్యూజిల్యాండ్ అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద 6.0గా నమోదు అయ్యిందని అధికారులు చెప్పారు.
న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ లో భూకంపం ప్రభావం కనిపించింది. పలు సార్లు భూమి కంపించిందని, అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని న్యూజిలాండ్ మీడియా వెల్లడించింది. న్యూజిలాండ్ లోని పలు చోట్ల భవనాలు గోడలు చీలిపోయాయి.
భూకంపం వచ్చిన ప్రాంతానికి అధికారులు, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆస్తినష్టం జరిగినా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.