ఖషోగ్గి హత్య కేసులో కీలక పరిణామం: ఫ్రాన్స్లో అనుమానితుడు అరెస్టు..డొంక కదులుతోందా..?
సౌదీ జర్నలిస్టు జమాల్ కషోగ్గి హత్య కేసులో డెవలప్మెంట్స్ చోటుచేసుకున్నాయి. జమాల్ కషోగ్గి హత్యలో అనుమానిత నిందితుడిని ఫ్రాన్స్ పోలీసులు అరెస్టు చేశారు. పారిస్ నుంచి రియాద్కు వెళ్లేందుకు అనుమానిత నిందితుడు విమానం ఎక్కేందుకు ఎయిర్పోర్టుకు చేరుకోగా... అక్కడే అతన్ని అరెస్టు చేసినట్లు ఫ్రెంచ్ లా ఎన్ఫోర్స్మెంట్ శాఖ వెల్లడించింది.
కషోగ్గి హత్యకేసుకు సంబంధించిన అనుమానితుడిని అరెస్టు చేయడం పై హర్షం వ్యక్తం చేసింది ఆయనకు కాబోయే భార్య. వెంటనే అతన్ని విచారణ చేసి నిజాలు వెలికి తీయాలని కోరారు. 2018లో హత్యకు గురైన కషోగ్గి కేసులో ప్రస్తుతం ఫ్రాన్స్ పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదని పారిస్లోని సౌదీ ఎంబసీ స్పష్టం చేసింది. వెంటనే అతన్ని విడుదల చేయాలని ఎంబసీ ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని కోరినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక అరెస్టు అయిన వ్యక్తి పేరు ఖాలేద్ అయేద్ అల్-ఒతాయిబి అని ఫ్రెంచ్ పోలీసులు చెప్పుకొచ్చారు. సౌదీ రాయల్ గార్డులో మాజీ సభ్యుడని పేర్కొంది. ఇక బ్రిటీష్ మరియు అమెరికా దేశాలు విధించిన ఆంక్షల జాబితాలో ఉన్న పేరు కూడా ఇదే అని ధృవీకరించారు. కషోగ్గి హత్య కేసులో ఇదే పేరుతో ఉన్న వ్యక్తికి సంబంధం ఉందని ఈ దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక కూడా స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే 2019లో టర్కీ జారీ చేసిన అరెస్టు వారెంట్పై పోలీసులు రియాక్ట్ అయ్యారు. కషోగ్గి టర్కీలోనే హత్యగావించబడ్డాడు. వాషింగ్టన్ పోస్టు అనే అంతర్జాతీయ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తూ సౌదీ యువరాజు మొమ్మద్ బిన్ సల్మాన్ పాలనపై విమర్శలు గుప్పించారు జమాల్ కషోగ్గి. 2018 అక్టోబర్ 2వ తేదీన తాను ఇస్తాంబుల్లోని సౌదీ కాన్సులేట్లోకి ప్రవేశిస్తూ చివరిసారిగా కనిపించారు. అయితే అతన్ని హత్య చేసి మృతదేహాన్ని మాయం చేశారని టర్కీ ఆరోపించింది. ఇప్పటి వరకు అతని అస్తికలు కూడా ఏవీ దొరకలేదు. ఇదే సమయంలో ఈ ఏడాది అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం ఓ సంచలన రిపోర్టు విడుదల చేసింది. కషోగ్గి హత్య వెనక సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉందని పక్కా ప్రణాళిక ప్రకారమే అతన్ని హత్య చేయించారంటూ అమెరికా నిఘా వర్గాలు సెన్సేషనల్ రిపోర్టును విడుదల చేసింది.అయితే అమెరికా నిఘా నివేదికను సౌదీ ప్రభుత్వం ఖండిస్తూ, కషోగ్గి హత్యలో రాజు సల్మాన్ హస్తం లేదని స్పష్టం చేసింది.
గతేడాది ఇదే కేసుకు సంబంధించి సౌదీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏడేళ్ల నుంచి 20 ఏళ్ల వయస్సున వారికి జైలు శిక్ష విధించడం జరిగింది. అయితే వారికి సంబంధించిన వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. దీన్ని అంతర్జాతీయ మానవహక్కుల సంఘం ఖండించింది. అసలు దోషులు బయట తిరుగుతున్నారంటూ వ్యాఖ్యానించింది. అయితే తాజాగా అరెస్టు అయిన వ్యక్తితో నిజాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయని.. కేసులో ఈ అరెస్టు కీలక పరిణామంగా చెప్పుకొచ్చారు ఐక్యరాజ్యసమితిలో మాజీ విచారణాధికారిగా పనిచేసిన అగ్నేస్ కాళ్లమార్డ్. కషోగ్గి హత్యకేసులో 2019లో ఐక్యరాజ్యసమితిలో విచారణాధికారిగా పనిచేసిన సమయంలో ఆల్-ఒతాయిబీ పేరును తాను నివేదికలో ప్రస్తావించినట్లు చెప్పారు అగ్నేస్ కాళ్ల మార్డ్. టర్కీలో హత్యచేసి ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేసి సౌదీ అరేబియాకు వెళ్లిపోయాడని నివేదికలో పేర్కొన్నట్లు గుర్తుచేశారు. అయితే కషోగ్గి హత్య చేసిన వ్యక్తి ఇప్పుడు పట్టుబడ్డ వ్యక్తి ఒకరే అని నిర్థారించేందుకు మరింత లోతైన విచారణ అవసరమని అగ్నేస్ పేర్కొన్నారు.
అరెస్టు అయిన వ్యక్తిని బుధవారం కోర్టు ముందు హాజరుపరచి టర్కీకి పంపాలా లేదా అనేదానిపై కోర్టు ఆదేశాలను పాటిస్తామని అధికారులు చెప్పారు. మరోవైపు ఆల్ -ఒతాయిబీ ఫ్రాన్స్కు ఎలా చేరుకున్నాడనే దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications