గర్భిణీ భార్యను తినేసిన మొసలిని పోరాడి మరీ చంపాడు
న్యూఢిల్లీ: భార్య, ఆమె గర్భంలోని శిశువును ఓ మొసలి అమాంతం నమిలి మింగేయడాన్ని తట్టుకోలేని ఓ వ్యక్తి దానిపై ప్రతీకారం తీర్చుకున్న సంఘటన యుగాండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే యుగాండాలో నాలుగు నెలల క్రితం ముబారక్ బటాంబుజే భార్య దిమెత్రియో నబిరే (గర్భిణీ) తన గూడెం మహిళలతో కలిసి నీళ్లు తీసుకురావడానికి క్యోగా సరస్సు దగ్గరికి వెళ్లింది.
సరస్సులో నీళ్లు తీసుకందామని కొంచెం లోపలికి వెళ్లగానే ఒక మొసలి ఆమెపై అమాంతం ఎగబడి నీటిలోకి ఈడ్చుకుపోయింది. దీంతో దుఃఖంలోకి వెళ్లిపోయాడు. జనవరిలో ఆ మొసలి మరోసారి కనిపించిందని ఆ నోటా ఈ నోటా విన్న ముబారక్ ఎలాగైనా తన కుటుంబాన్ని తినేసిన మొసలిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లి దాన్ని కనుగొన్నాడు. దానిని కర్రలు, రాళ్లతో చంపేందుకు ప్రయత్నించాడు. కానీ ఏమీ చేయలేక పోయారు. దీంతో స్ధానికంగా ఉండే ఓ కమ్మరి దగ్గరికి వెళ్లి తానేం చేయాలనుకుంటున్నాడో అతడికి వివరంగా చెప్పాడు. దీంతో ఆ కమ్మరి ప్రత్యేకమైన ఈటెను తయారు చేశాడు. దాంతో ఆ మొసలిపై గంటన్నర సేపు పోరాడి చివరికి దానిని అంతం చేశాడు. ఆ మొసలి నాలుగు మీటర్లు పొడవు, 600 కేజీల బరువు ఉంది.