ఆయుధాగారంలో భారీ పేలుడు: ఎగిసిన మంటలు: ఆర్మీ వివరణ ఇదీ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఆయుధాగారంలో భారీ పేలుడు సంభవించింది. వరుస పేలుళ్లతో సంఘటనా స్థలం దద్దరిల్లిపోయింది. ఊహించని ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియని అయోమయ పరిస్థితిలో పడిపోయారు. ఆయుధాగారంలో సంభవించిన పేలుడును ఆర్మీ అధికారులు నిర్దారించారు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం చోటు చేుకున్నట్లు వెల్లడించారు. ప్రాణనష్టం తప్పిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్ ప్రభుత్వం పతనం అంచుల్లో నిలిచింది. కుప్పకూలిపోయే స్థితికి చేరుకుంది. ఈ నెల 27వ తేదీన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటోన్నారాయన. ఈ పరిస్థితుల్లో కీలకమైన ఆయుధాగారంలో పేలుడు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన ప్రభుత్వానికి సైన్యం అండగా ఉందంటూ ఆయన ఇమ్రాన్ ఖాన్ ఇదివరకు ప్రకటించుకున్న నేపథ్యంలో- ఈ పేలుడు ఘటనపై అందరి దృష్టీ పడింది.
#Pakistan - Multiple explosions at the #Sialkot military base in northern Pakistan. Initial indications are this is an ammunition storage area. A large fire is burning. Cause as yet unverified. https://t.co/FGvCKDdobc
— Rishi Suri (@rishi_suri) March 20, 2022
పంజాబ్ ప్రావిన్స్లోని సియాల్ కోట్లో ఉంటుందీ ఆయుధగారం. పాకిస్తాన్లో ఉన్న అతి కొద్ది భారీ ఆయుధాగారాల్లో ఇదీ ఒకటి. సైన్యం వినియోగించే అన్ని రకాల ఆయుధ సంపత్తిని ఇక్కడ నిల్వ ఉంచుతుంటారు ఆర్మీ అధికారులు. 24 గంటల పాటు భద్రత పర్యవేక్షణ కొనసాగుతుంటుంది. అత్యాధునికమైన భద్రతను కల్పించారు ఈ డిపోనకు. అలాంటి చోటు అనూహ్యంగా పేలుడు సంభవించడంతో తీవ్ర కలకలం చెలరేగింది.
పేలుడు సంభవించిన వెంటనే దట్టమైన పొగలు ఆకాశాన్ని అంటుకున్నాయి. ఆ వెనుకే మంటలు చెలరేగాయి. చెవులు చిల్లులు పడేలా శబ్దం చేస్తూ ఆయుధాగారంలో వరుస పేలుళ్లు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతున్నదో అర్థం కాని స్థితిలో పడిపోయారు. పేలుళ్లు సంభవించిన కొద్దిసేపటికే ఆర్మీ అధికారులు, స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాణాపాయం లేదని, స్థానికులు భయాందోళనలకు గురి కావొద్దని విజ్ఞప్తి చేశారు.

ఈ పేలుడు సంభవించడానికి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణమని నిర్ధారించారు. సియాల్కోట్ కంటోన్మెంట్ పరిధిలోని గ్యారిసన్లో ఈ పేలుడు సంభవించిందని, ఆస్తినష్టం భారీగా ఉందని తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ మరణించడం గానీ, గాయపడటం గానీ చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని, మంటలను ఆర్పివేశారని అన్నారు.












Click it and Unblock the Notifications