మైక్రోసాఫ్ట్ సిఇవోగా హైదరాబాదీ సత్య నాదెళ్ల?
వాషింగ్టన్: ప్రపంచంలోని అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్కు హైదరాబాదీ నేతృత్వం వహించబోతున్నారు. హైదరాబాద్కు చెందిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సిఇవోగా నియమితులు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇవో) గా నియమితులు కానున్నట్లు అమెరికా మీడియా చెబుతోంది.
చాలా వారాలుగా కొత్త సిఇవో కోసం అన్వేషణ సాగుతోందని, అందుకు ముగ్గురు పోటీలో ఉన్నారని, ఆ ముగ్గురిలో 46 ఏళ్ల నాదెళ్ల పేరు ఉందని అమెరికా మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి. మరో ఇద్దరిలో స్కైప్ మాజీ సిఇవో, మైక్రోసాఫ్ట్ స్ట్రేటజీ హెడ్ టోనీ బేట్స్ ఉన్నారు. స్కైప్ను మైక్రోసాఫ్ట్ 2011లో సొంతం చేసుకుంది.

సిఇవో రేసులో మరొకరు నోకియా మాజీ హెడ్ స్టీఫెన్ ఎలోప్ అని చెబుతున్నారు. నోకియాను మైక్రోసాఫ్ట్ 2013లో స్వాధీనం చేసుకుంది. అయితే, అన్వేషణ ఇంకా పూర్తి కాలేదని చెబుతున్నారు. ఓ టెక్ న్యూస్ వెబ్సైట్ గురువారంనాడు మైక్రోసాఫ్ట్ సిఇవో నియామకంపై కథనాలను ఇచ్చింది.
సత్య నాదెళ్లకే ఎక్కువ అవకాశాలున్నాయని, వచ్చే వారంలో ఈ విషయంపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. స్టీవ్ బలిమేర్ స్థానంలో సమర్థుడైన వ్యక్తిగా నాదెళ్లను పరిగణిస్తున్నట్లు అమెరికా మీడియా వ్యాఖ్యానిస్తోంది.












Click it and Unblock the Notifications