నేపాల్లోని భారత్ ఎంబసీ వద్ద పేలుడు, ఎవరికీ ఏం కాలేదు
ఖాట్మాండ్: నేపాల్లోని బీరత్నగర్ భారత్ ఎంబసీ వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. ఇక్కడ తాత్కాలిక ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం ఉంది. ఇది ఖాట్మాండుకు 380 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ పేలుడు ధాటికి కార్యాలయ గోడలు స్వల్పంగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. గత రాత్రి కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో బాంబు పేలినట్లు పోలీసులు తెలిపారు. పేలుడుకు గల కారణాలు, ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఓ రాజకీయ పార్టీ సోమవారం బీరత్ నగర్లో బంద్కు పిలుపినిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో స్థానిక రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కాగా, నేపాల్లో, ఉత్తర బీహార్లో భారీ వరదలు వచ్చినప్పుడు తాత్కాలికంగా ఎంబసీ కార్యాలయం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అది కొనసాగుతోంది. ఇది బీహార్కు ఆరు కిలో మీటర్ల దూరంలో ఉంది.