మలేషియాకు థర్డ్ షాక్: ప్లేన్ కోసం రాత్రంతా, బెలితుంగ్ వద్ద కూలిందా?
న్యూఢిల్లీ: ఇండోనేసియా నుండి సింగపూర్ వెళ్తూ అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం అదృశ్యం కావడంతో విమానయానంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇది మూడో సంఘటన పది నెలల క్రితం ఎంహెచ్ 370 అదృశ్యమైంది. దాని జాడ ఇప్పటికీ దొరకలేదు. ఆ తర్వాత ఎంహెచ్ 17 క్రాష్ అయింది. ఇప్పుడు ఎయిర్ ఏషియా, క్యూజెడ్8501 అదృశ్యమైంది.
ఎంహెచ్ 370 గల్లంతై పది నెలలు గడుస్తున్నా దాని ఆచూకీ దొరకలేదు. ఇప్పటికీ దాని కోసం గాలిస్తున్నారు. ఇందులో ఉన్న 237 మంది మృతి చెందినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మలేషియా ఎయిర్ లైన్స్కే చెందిన ఎంహెచ్ 17 ఉక్రెయిన్ గగనతలంలో రష్యా అనుకూల తిరుగుబాటుదారులు కూల్చివేశారు. ఈ ఘటనలో 298 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పుడు 162 మందితో వెళ్తున్న మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా బెటలింగ్ ద్వీపం తూర్పు తీరంలో కూలిపోయినట్లుగా భావిస్తున్నారు. మలేషియాకు చెందిన విమానాలకు వరుస ప్రమాదాలు ఎదురవుతుండటం వల్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దేశపు విమానాలకే ఎందుకు ఇలా జరుగుతోందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మలేషియాకు ఎయిర్ ఏషియాకు సాధారణ ప్రయాణీకులకు అందుబాటులో ఉండేలా విమాన సేవలు అందిస్తోంది. వంద గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. పలు ఆసియా దేశాలకు రాయితీలతో కూడిన విమాన సర్వీసులు అందిస్తోంది.
గాలింపులో భారత్, విమానంలో భారతీయులు లేరు
అదృశ్యమైన విమానాన్ని గాలించేందుకు ఇండియన్ నేవీ కూడా గాలింపు చర్యలు చేపడుతోంది. ఇందు కోసం మూడు నౌకలను రంగంలోకి దించింది. మరో ఒక ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ను (బోయింగ్ పీ8-I)ను కూడా పంపించింది. ఈ విమానంలో భారతీయులు లేరని అధికారులు చెప్పారు.
అక్కడ కూలిందా?
గల్లంతైన ఎయిర్ ఏషియా విమానం ఓ సముద్రంలో కూలినట్లుగా వార్తలు వస్తున్నాయి. జావా సముద్రంలో అది కూలిందని అంటున్నారు. బెలితుంగ్ తిమూర్ ద్వీపం వద్ద అది కూలిందనే వార్తలు వస్తున్నాయి. విమానం అదృశ్యం నేపథ్యంలో వైట్ హౌస్ దీనిని పర్యవేక్షిస్తోంది. రాత్రి పూట కూడా గాలించేందుకు చర్యలు తీసుకున్నారు. గాలింపులో సింగపూర్ వైమానిక, నావికా దళాలు రంగంలోకి దిగాయి.
ఈ ఏడాది విమాన ప్రమాదాలు...
మార్చి 8వ తేదీన ఎంహెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుండి చైనా రాజధాని బీజింగ్కు బయలుదేరిన కాసేపటికే గల్లంతైంది. ఇప్పటి వరకు దాని జాడ తెలియరాలేదు. దక్షిణ హిందూ సముద్రంలో కూలినట్లుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రమాదంలో 237 మంది మృతి చెందారు.
జూలై 17న ఎంహెచ్ 17 నెదర్లాండులోని ఆమ్స్టర్డామ్ నుండి మలేషియా రాజధాని కౌలాలంపూర్కు బయలుదేరిన విమాన ఉక్రెయిన్లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారుల క్షిపణిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 298 మంది చనిపోయారు.
జూలై 23వ తేదీన ట్రాన్స్ ఏసియా ఎయిర్ వేస్ విమానం తైవాన్లో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 51 మంది చనిపోయారు.
ఆగస్టు 10న టెహ్రాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుండి దక్షిణ ఖోరసాన్ ప్రావిన్స్లోని టబాస్ నగరానికి బయల్దేరిన టబాన్ ఎయిర్ లైన్స్ విమానం కూలిన ప్రమాదంలో 40 మంది మృతి చెందారు.
ఆగస్టు 25న ఎండీ-83 బుర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగో నుండి అల్జీరియా రాజధాని అల్జీర్స్కు బయల్దేరిన విమానం కుప్పకూలగా డెబ్బై మందికి పైగా మృతి చెందారు.