బ్రిటన్ పార్లమెంట్ గోడలపై 'మోడీ నాట్ వెల్కం' ప్రొజెక్ట్
లండన్: మనదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న 'అసహనం' ప్రకంపనలు ఆయన ప్రస్తుతం(నవంబర్ 12 నుంచి 3రోజులపాటు) పర్యటిస్తున్న బ్రిటన్ దేశాన్ని తాకాయి. మోడీ రాకను నిరసిస్తూ.. యూకేకు చెందిన సామాజిక కార్యకర్తల వేదిక 'ఆవాజ్' లండన్లో పలు ప్రదర్శనలు నిర్వహించింది.
తాము మోడీని స్వాగతించడం లేదని చెబుతూ.. లండన్ పార్లమెంటు భవంతిపై ఆవాజ్ ఓ చిత్రాన్ని ప్రొజెక్ట్ చేసింది. 'మోడీ నాట్ వెల్ కమ్' అంటూ కత్తి పట్టుకున్న మోడీ చిత్రాన్ని, వెనుక స్వస్తిక్, ఓం చిత్రాలను కలుపుతూ తయారు చేసిన లోగోను ప్రదర్శించింది.
మోడీ అధికారిక పర్యటన నిమిత్తం బ్రిటన్కు వెళ్లిన వేళ, ఏకంగా పార్లమెంటు భవంతిపైనే ఈ పోస్టరును ప్రొజెక్ట్ చేయడాన్ని పలువురు ప్రజా ప్రతినిధులు ప్రశ్నించారు. ఇందుకు కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాగా, తమ చిత్రానికి ఆవాజ్ వివరణ ఇస్తూ.. ఇండియాలో మైనారిటీలు, దళితులపై ఆనాటి నాజీయిజాన్ని గుర్తుకు తెస్తూ దాడులు జరుగుతున్నాయని, అందువల్లే ఇలా చేశామని పేర్కొంది.
క్వీన్ ఎలిజబెత్తో మోడీ విందు
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నుంచి మూడు రోజుల పర్యటన కోసం బ్రిటన్కు బయలుదేరి వెళ్లారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కెమరూన్తో ఆయన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. బ్రిటీష్ రాణి ఎలిజబెత్తోనూ ఆయన విందులో పాల్గొంటారు. వ్యాపారవేత్తలతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత వెంబ్లే స్టేడియంలో జరిగే సభలో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
తన పర్యటన వల్ల బ్రిటన్తో ఆర్థిక సంబంధాలు బలపడుతాయన్న ఆశాభావాన్ని ప్రధాని ట్వీట్టర్లో వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కోసం మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలని యోచిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. హాక్ యుద్ధ శిక్షణ విమానాల కొనుగోలుపై బ్రిటన్తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలున్నాయి.
కాగా, మోడీ లండన్లో గౌరవ వందనం స్వీకరిచిన అనంతరం ప్రధాని కెమరూన్తో కలసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొంటారు. బ్రిటన్ పార్లమెంటులో కూడా మోడీ ప్రసంగిస్తారు. అక్కడే ఇద్దరు నేతలు యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.
బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ను బంకింగ్హామ్ ప్యాలెస్లో శుక్రవారం నాడు మోడీ కలుసుకుంటారు. ఆ తర్వాత వెంబ్లే స్టేడియంలో జరిగే భారీ ర్యాలీలో మోడీ పాల్గొంటారు. దాదాపు 600 మంది ఆర్టిస్టులతో ఈ సందర్భంగా ఒలింపిక్ వేడుక తరహాలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 60 వేల మంది ఈ ఈవెంట్కు హాజరుకానున్నారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కెమరూన్ స్వాగతోపన్యాసం ఇస్తారు.