కరోనాను అమెరికా లైట్గా తీసుకుందా?: 2200 దాటిన మృతులు: ఇటలీలో 10 వేల మందికి పైగా..!
న్యూయార్క్: భయానక కరోనా వైరస్ తీవ్రత ఎలా ఉంటుందో అగ్రరాజ్యం అమెరికాకు తెలిసి వస్తోంది. ఈ మహమ్మారి ధాటికి అతలాకుతలం అవుతోంది. దిక్కుతోచని స్థితికి చేరుకుంది. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటమే దీనికి నిదర్శనం. ఇప్పటికే లక్షా 26 మందికి పైగా అమెరికా పౌరులు వైరస్ బారిన పడ్డారు. ఆసుపత్రులు, ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్లల్లో భయాందోళనల మధ్య కాలం గడుపుతున్నారు.
2,200ను దాటిన కరోనా మృతుల సంఖ్య
అమెరికాలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,227కు చేరుకుంది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలతో పోల్చుకుంటే అమెరికాలో దీని తీవ్రత అత్యధికంగా కనిపిస్తోంది. మరణాల సంఖ్య శరవేగంగా పెరగటంలో అమెరికా.. మిగిలిన దేశాలను అధిగమించింది. అమెరికాలో కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రులు, ఐసొలేషన్ వార్డులు, క్వారంటైన్లలో చికిత్స పొందుతోన్న వారి సంఖ్య 1,23,750కి చేరుకోవడాన్ని బట్టి చూస్తోంట.. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా 30 వేల మందికి పైగా
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య అడ్డూ, అదుపు లేకుండా పెరుగుతోంది. రోజూ వందలాది మంది దీని బారిన పడి మరణిస్తున్నారు. ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇరాన్, యునైటెడ్ కింగ్డమ్.. ఇలా అభివృద్ధి చెందిన దేశాలన్నీ కరోనా వైరస్ విలయతాండవానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచాయి. ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 30,879కి చేరుకుంది. మరో 6,63,740 మంది పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
న్యూయార్క్లో అత్యధిక మరణాలు
అమెరికాలో కరోనా వైరస్ మరణాలు లేని రాష్ట్రాల సంఖ్య చాలా తక్కువ. అత్యధికంగా న్యూయార్క్లో కరోనా మరణాలు నమోదయ్యాయి. న్యూయార్క్లో 883 మంది మరణించారు. వాషింగ్టన్-189, న్యూజెర్సీ-140, ల్యూసియానా- 137,కాలిఫోర్నియా-120, మిచిగాన్-111 మంది మృత్యువాత పడ్డారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు కూడా ఈ మహమ్మారి బారిన పడ్డాయి. ఇప్పట్లో ఈ విలయం ఆగేలా కూడా కనిపించట్లేదు. గంటగంటకూ మృతుల సంఖ్య పెరుగుతోంది అమెరికాలో.
ఇటలీలో 10 వేల మార్క్..
ఇటలీలో విధ్వంసాన్ని సృష్టిస్తోందీ కరోనా వైరస్. 10 వేలమందికి పైగా ఇటాలియన్లు మృత్యువాత పడ్డారు. 10,023 మంది ఒక్క ఇటలీలోనే మరణించారు. 92 వేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. స్పెయిన్-5982, ఫ్రాన్స్-2314, ఇరాన్-2517 మంది మరణించారు. చైనాలో వైరస్ తీవ్రత ఒకింత తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తున్నప్పటికీ.. మరణాల సంఖ్యకు బ్రేక్ పడట్లేదు. చైనాలో 3300 మంది మరణించగా.. 81,439 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజులో 45 కొత్త కేసులు నమోదు అయ్యాయి.