మంచి ఖైదీలు... పారీపోయి, తిరిగి జైలుకు చేరుకున్న 270 మంది
జైలునుండి పారిపోయిన ఖైదీలు తిరిగి రావడం చాల అరుదు... అది కూడ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 270 మంది ఇలా జైలునుండి పారిపోయి తిరిగి జైలుకు చేరుకున్న సంఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. అయితే జైలునుండి పారిపోయింది మాత్రం 500 మంది ఖైదీలని అధికారులు చెప్పారు. అయితే పారిపోయిన మిగాతా ఖైదీలు కూడ తిరిగి వస్తారనే ఆశాభావంతో జైలు అధికారులు ఉండడం గమనార్హం.
ఇండోనేషియాలో మంచి ఖైదీలు
సందుదొరికితే చాలు ఎప్పుడు పారిపోతామా అని ఎదురు చూసే ఖైదీలు దేశంలో కోకోల్లలుగా ఉంటారు.. ముందు పారీపోదాం తర్వాత దొరికినప్పుడు చూద్దాంలే అనే మనస్థత్వంతో కరుడు ఖైదీలు ఉంటారు. అయితే ఇందుకు విరుద్దంగా ఇండోనేషియాలో జరిగింది. ఇండోనేషియాలో సోరాంగ్ జైలులో పారిపోయిన 500 మంది ఖైదీల్లో తిరిగి 270 మంది తిరిగి జైలుకు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే ఇండోనేషియాలోని పుపువాలో స్థానిక సమస్యలతో విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వీరిలో కొంతమంది విద్యార్థులను ఆరెస్ట్ చేయడంతో మరింత ఉద్రిక్త పరిస్థులు నెలకొన్నాయి.. ఈ ఆందోళనలు తీవ్రతరం కావడంతో విద్యార్థులు అగ్రహానికి గురయ్యారు. దీంతో నగరంలోని సోరాంగ్ నగరంలోని జైలుకు నిప్పుపెట్టారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలు అర్పడం సిబ్బందితరం కాలేదు. దీనికి తోడు జైలు మొత్తం మంటల్లో కాలిపోయో పరిస్థితి కనిపించింది.
జైలు అధికారుల మంచితనమే కారణం
ఈనేపథ్యంలోనే అవకాశం లభించదని భావించిన ఖైదీలు ఆలోచించకుండా జైలులో ఉన్న 500 మంది ఖైదీలు ఒకేసారి పారిపోయారు. అయితే జైలు అధికారలు చేపట్టిన సంస్కరణలు, వారికి చెప్పే మాటల వల్ల అందులో కొంతమంది వెనక్కి తిరిగి వచ్చారు. ఈనేపథ్యంలోనే శిక్షాకాలం పూర్తి కాకుండా పారిపోవడం వల్ల ప్రయోజనం ఉండదని, అపరాధభావం, భయం జీవితాంతం వెంటాడుతుందని, శిక్షాకాలం పూర్తయ్యాక దర్జాగా సాధారణ జీవితం గడపొచ్చని తాము ఎప్పుడూ చెబుతుంటామని జైలు అధికారలు చెప్పారు. జైలుకు తిరిగి వచ్చిన వారిలో హత్య కేసుల్లో శిక్షలు పడ్డవారు సైతం ఉన్నారని చెప్పారు. అయితే ముందుగా ప్రాణ రక్షణ కోసమే పారిపోయారని వారు తెలిపారు.
మిగతా ఖైదీలు కూడ తిరిగి వస్తారు...!
కాగా ఖైదీలను బాగా చూసుకోవడంతోనే పారీపోయిన ఖైదీలు తిరిగి జైలుకు తిరిగి వచ్చారని తెలిపారు. కాగా జైలుకు వచ్చిన ఖైదీలు ఖాలీపోయిన గదులను శుభ్రం చేయడంతో పాటు వాటి మరమ్మత్తులలో కూడ స్వఛ్చందంగా పాల్గోన్నారని,మిగతా ఖైదీలు కూడా తమ బంధు, మిత్రుల యోగ క్షేమాలు తెలుసుకుని ఒకటి, రెండు రోజుల్లో తిరిగొస్తారని తాము ఆశిస్తున్నామని జైలు ప్రతినిధి ఎల్లి యోజర్ తెలిపారు. మరి జైలు అధికారుల ఆశాభావాన్ని మిగతా ఖైదీలు కూడ నిలుపుతారా లేదా అనేది వేచి చూడాలి.