మళ్లీ నిర్బంధంలోకి సూకీ: రాత్రికి రాత్రి అరెస్టులు: పొరుగుదేశంలో ఏం జరుగుతోంది?
రంగూన్: పొరుగు దేశం మియన్మార్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోసారి ఆ దేశం సైనిక పాలనలోకి వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశ సైన్యాధికారులు రాత్రికి రాత్రి అరెస్టుల పర్వానికి తెర తీశారు. అంగ్సాన్ సూకీని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆమెతో పాటు అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ)కి చెందిన పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే కారణాన్ని చూపుతున్నారు. అంగ్సాన్ సూకీ సహా అధికార పార్టీకి చెందిన కొందరు కీలక నేతలను అరెస్ట్ చేసిన విషయాన్ని ఎన్ఎల్డీ ధృవీకరించింది.

మళ్లీ సైనిక పాలన..
మియన్మార్ సుదీర్ఘ కాలం పాటు సైనిక పాలనలో కొనసాగింది. 2011 వరకూ ఆ దేశం సైనిక పాలనలోనే ఉండేది. అంగ్సాన్ సూకీ ఏళ్ల తరబడి గృహ నిర్బంధంలో గడిపారు. అనేక అంతర్జాతీయ ఒత్తిళ్ల తరువాత ఆమె విముక్తి పొందారు. 2015లో నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో ఆమె సారథ్యంలోని ఎన్ఎల్డీ ఘన విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయిదేళ్ల కాల వ్యవధి ముగియడంతో గత ఏడాది నవంబర్లో మరోసారి ఎన్నికలను నిర్వహించారు. వరుసగా రెండోసారి ఎన్ఎల్డీకి విజయం వరించింది. 2015 నాటి కంటే మెజారిటీ సీట్లను సాధించగలిగింది

అక్రమాలకు పాల్పడ్డారంటూ..
గత ఏడాది నవంబర్లో నిర్వహించిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ అక్కడి సైన్యాధికారులు ఆరోపించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు, ఇతర సమాచారాన్ని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి అందజేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టారు ఎన్నికల అధికారులు. మిలటరీ అధికారులు చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. ఎలాంటి అక్రమాలు గానీ, అవకతవకలు గానీ చోటు చేసుకోలేదని ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన రెండు రోజుల్లోనే.. సైనికులు తిరుగుబాటును లేవదీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పార్లమెంట్ ప్రారంభం కావాల్సి ఉండగా..
సోమవారం నుంచి మియన్మార్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. అంతకుముందు రోజు రాత్రే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంగ్సాన్ సూకీని మిలటరీ అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆమెతో పాటు అధికార పార్టీకి చెందిన పలువురిని అరెస్ట్ చేసినట్లు ఎల్ఎల్డీ అధికార ప్రతినిధి మ్యో న్యుంట్ తెలిపారు. ఎలాంటి కారణాన్ని చూపకుండా సూకీ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనను శాంతియుతంగా ఎదుర్కొందామని, ఎలాంటి విధ్వంసక చర్యలకు పాల్పడొద్దంటూ ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Recommended Video

ప్రసారాల నిలిపివేత..
అంగ్సాన్ సూకీని నిర్బంధంలోకి తీసుకున్న కొద్దిసేపటికే అక్కడి టెలివిజన్ ప్రసారాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. సాంకేతిక కారణాల వల్ల కార్యక్రమాలను ప్రసారం చేయలేకపోతున్నామని అధికార మియన్మార్ రేడియో అండ్ టెలివిజన్, మియన్మార్ రేడియో వెల్లడించాయి. పాత కార్యక్రమాలనే ప్రసారం చేసింది. ఈ పరిణామాల పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాన్ని కూలదోయాలనుకోవడం అనైతికమని పేర్కొంది. అలాంటి చర్యలను ఎవరూ ప్రోత్సహించబోరని తెలిపింది.












Click it and Unblock the Notifications