సూర్యుడిపై భారీ మచ్చ: నాసా కెమెరాకు చిక్కింది
వాషింగ్టన్: సూర్యుడి ఉపరితలంపై శుక్రవారం ఏర్పడిన భారీ సన్ స్పాట్ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా క్యాప్చర్ చేసింది. సౌర వాతావరణంలో ఏర్పడే అయస్కాంత శక్తి ఒక్కసారిగా బయటికి వచ్చే ప్రయత్నంలో ఏర్పడే పేళుల్లే సోలార్ ఫ్లేర్స్. వీటిని ఎక్స్ క్లాస్ స్థాయుల్లో వెల్లడిస్తారు. తాజాగా సంభవించిన ఫ్లేర్ ఎక్స్-త్రీ స్థాయిదని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ ఫ్లేర్స్తో బాటే అత్యధిక స్థాయిలో రేడియేషన్ కూడా విడుదల అవుతుంది. వాటి స్థాయులను బట్టి భూమి వాతావరణం ఈ రేడియేషన్ను శోషించుకుంటుంది. అయితే రేడియో, జీపీఎస్ తరంగాలపై ఇది ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.
వాస్తవానికి ఈ వారంలో దాదాపు ప్రతిరోజూ సోలార్ ఫ్లేర్స్ సంభవిస్తూనే ఉన్నాయట. కానీ శుక్రవారం నాటి సోలార్ ఫ్లేర్ను గడిచిన 24 సంవత్సరాలలో చూడలేదని నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (ఎస్డీఓ) పేర్కొంది. ఈ సన్ స్పాట్ (సూర్యుడిపై మచ్చ)ను నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ వ్యోమనౌక గుర్తించింది.
ఏఆర్ 12192 అనే భారీ క్రియాశీలక ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. అక్కడ ఎక్స్ 3.2 స్థాయి సౌరకీల (సోలార్ ఫ్లేర్) ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో అక్టోబర్ 19 నుండి ఎక్స్ తరగతి కీల వెలువడటం ఇది నాలుగోసారి. ఎక్స్ అనేది అత్యంత తీవ్ర సౌర కీలలకు చిహ్నం. ఆ తర్వాత సంఖ్య దాని బలాన్ని సూచిస్తుంది.
ఈ సూర్యుడి మచ్చ వెడల్బు 80వేల మైళ్ల మేర ఉంది. ఇందులో భూమి లాంటి గ్రహాలు పది ఇముడుతాయి. సౌర కీలలు.. రేడియో ధార్మికతకు సంబంధించిన శక్తిమంతమైన విస్ఫోటాలు.
యాజిదీల కోసం...
ఇరాక్లో తీవ్రవాదుల చెరలో చిక్కిన యాజిదీల కోసం అమెరికాలోని భారత సంతతి పౌరులు గళమెత్తారు. ఐసిస్ తీవ్రవాదులకు, అమెరికా సంకీర్ణ బలగాలకు మధ్య పోరులో యాజిదీల ఉనికి ప్రమాదంలో పడిపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై అమెరికాలోని యాజిదీ తెగ పౌరులు అమెరికా అధ్యక్షుడి అధికారి భవనం వైట్హౌస్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారత సంతతి అమెరికా పౌరులు పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. యాజిదీల రక్షణ, తరలింపు కోసం అమెరికా ప్రభుత్వం చేయాల్సినంత చేయడం లేదని వారు ఆక్షేపించారు.