వివాదం: నేపాల్ భూకంప బాధితులకు ‘బీఫ్ మసాల’ పంపిన పాక్
ఖాట్మాండ్: నేపాల్లో సంభవించిన భారీ భూకంపంతో నిరాశ్రయులైన లక్షలాది మంది నేపాళీయులకు ప్రపంచ వ్యాప్తంగా సహాయ సహకారాలు అందుతున్నాయి. వారి ఆకలిని తీర్చేందుకు చాలా దేశాలు ఆహార పదార్థాలను పంపుతున్నాయి. కాగా, పాకిస్థాన్ కూడా తమ దేశం నుంచి ఆహార పదార్థాలను పంపించింది.
అయితే వాటిని నేపాల్ వాసులెవ్వరూ కూడా ముట్టుకోలేదు. ఎందుకంటే నేపాల్ ప్రధానంగా హిందువులు ఉండే దేశం. పాకిస్థాన్ పంపిన ‘బీఫ్ మసాల' ప్యాకేట్లను చూసి నేపాళీయులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆవును హిందువులు ఆరాధ్య దైవంగా భావిస్తారు. అంతేగాక, వారు గొడ్డు మాంసానికి దూరంగా ఉంటారు.
హిందువుల దేశమైన నేపాల్లో గోవధ నిషేధం అమలులో ఉంది. ఇక్కడ ఎవరైనా గోవధ చేస్తే వారికి 12ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. 1990కి ముందు అయితే ఈ నేరానికి ఉరిశిక్ష వేసేవారు.
కాగా, పాక్ పంపిన బీఫ్ కారణంగా నేపాల్ దేశంలో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ‘డెయిల్ మెయిల్' కథనం ప్రకారం భారతదేశానికి చెందిన వైద్యులు పాకిస్థాన్ పంపిన ప్యాకేట్లను గమనించి అధికారులను అప్రమత్తం చేశారు. కాగా, విషయం తెలిసిన నేపాళీలు ఎవ్వరూ కూడా పాక్ పంపిన ‘బీఫ్ మసాల' ప్యాకేట్లను ముట్టుకోలేదు.
నేపాల్-పాకిస్థాన్ దేశాల ద్వైపాక్షిక సంబంధాల మీద కూడా ఈ అంశం ప్రభావం చూపే అవకాశం ఉంది. ‘పాక్ పంపిన బీఫ్ మసాల గురించి నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలకు, ఇంటెలిజెన్స్ అధిపతికి చేరింది. దీనిపై వాస్తవాలను తెలుసుకునేందుకు అంతర్గత విచారణ చేపట్టాం. ఒక వేళ ఇది నిజమైతే పాకిస్థాన్తో ద్వైపాక్షిక స్థాయిలో చర్చిస్తాం. భారత్ మా ముఖ్య భాగస్వామి కాబట్టి, ఈ విషయాలపై వారితో పంచుకుంటాం' అని నేపాల్ అధికారులు పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇది ఇలా ఉండగా, ఇప్పటి వరకు భూకంపం కారణంగా 6,000వేల మంది ప్రాణాలు కోల్పోగా, 10,000మంది ప్రజలు గాయాలపాలయ్యారు. 39 జిల్లాల్లోని 8 మిలియన్ల ప్రజలపై ఈ భూకంప ప్రభావం ఉందని, 11 జిల్లాల్లో 2 మిలియన్ల మందికిపైగా ప్రజలపై తీవ్ర ప్రభావం ఉందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.