అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య
Nepal floods 2024: పొరుగుదేశం నేపాల్ దిగ్భ్రాంతికర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ సంభవించిన ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇప్పటివరకు 170 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. 112 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు.
కొద్దిరోజులుగా కురిసిన భారీ వర్షాలు, దీనివల్ల సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు నేపాల్ జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. రాజధాని ఖాట్మండూ సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అక్కడి నదులన్నీ కూడా ఉప్పొంగాయి. ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోన్నాయి.

ఖాట్మండూ వ్యాలీ, కోషి, బాగ్మతి ప్రావిన్స్ ఈ వరదలకు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వరదల వల్ల ఖాట్మండూ సిటీలో సైతం అనేక ప్రాంతాలు నీట మునిగాయి. పలు నివాసాలు కుప్పకూలాయి. ఖాట్మండూ రీజియన్లో సుమారు 1,500 నివాసాలు వరదల్లో మునిగాయి. ఈ ప్రాంతంలోనే 6,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఖాట్మండూ శివార్లలోని బల్ఖులో సహాయక, పునరావాస శిబిరాలను నెలకొల్పినట్లు నేపాల్ హోం మంత్రి రిషి రామ్ పొఖారెల్ తెలిపారు. 1,400 మంది వరకు ఇక్కడ తలదాచుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న 162 మందిని నేపాల్ ఆర్మీ కాపాడింది. హెలికాప్టర్ల ద్వారా వాళ్లను ఎయిర్ లిఫ్ట్ చేసింది. సురక్షిత ప్రదేశాలకు తరలించింది.

దేశవ్యాప్తంగా పలు నివాసాలు దెబ్బతిన్నాయని, 16 వంతెనలు కొట్టుకుపోయినట్లు ప్రభుత్వం తెలిపింది. చాలాచోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయని, అనేక పట్టణాలకు రోడ్ కనెక్టివిటీ దెబ్బతిన్నట్టు వివరించింది. 45 సంవత్సరాల కాలంలో ఈ స్థాయిలో వరదల విధ్వంసం సంభవించలేదని క్లైమెట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్ అరుణ్ భక్త శ్రేష్ఠ తెలిపారు.
ఈ వరదల ప్రభావం భారత్పైనా పడింది. నేపాల్తో సరిహద్దులను పంచుకుంటోన్న బిహార్, పశ్చిమబెంగాల్ వరద పోటును ఎదుర్కొంటోన్నాయి. కోషి, గండకి, భాగమతి నదులు ఉప్పొంగుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయించాయి ఆ రెండు ప్రభుత్వాలు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రాంత జిల్లాల్లో ఏరియల్ సర్వే సైతం నిర్వహించారు.












Click it and Unblock the Notifications