మరో దుస్సాహసానికి దిగిన ఉత్తర కొరియా.. సరిగ్గా అమెరికా చైనా భేటీకి ముందు క్షిపణి ప్రయోగం
అమెరికా గర్జిస్తున్నా.. చైనా వారిస్తున్నా ఉత్తర కొరియా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బుధవారం మరో ఖండాంతర క్షిపణిని జపాన్ సముద్ర జలాల్లోకి ప్రయోగించి దుస్సాహసమే చేసింది.
ప్యోంగ్ యాంగ్: తన దూకుడును ఏమాత్రం తగ్గించుకోని ఉత్తర కొరియా మరోమారు వార్తల్లో నిలిచింది. అమెరికా సహా పలు అగ్రదేశాలు చేసే హెచ్చరికలను పెడచెవిన పెడుతూ వరుస క్షిపణి పరీక్షలు జరుపుతున్న ఉత్తర కొరియా మరో దుస్సాహసం చేసింది.
ఉత్తరకొరియా బుధవారం మరోసారి అదే దుశ్చర్యకు దిగింది. ఓ ఖండాంతర క్షిపణిని జపాన్ ప్రాదేశిక సముద్ర జల్లాల్లోకి ప్రయోగించింది. ఉత్తర కొరియా తూర్పు సముద్రతీరంలో ఉన్న సింపో అనే పట్టణం నుంచి ఈ క్షిపణి ప్రయోగం జరిగింది. 37 మైళ్ల దూరం ప్రయాణించిన ఈ క్షిపణి జపాన్ సముద్ర జాలాల్లో పడింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, అమెరికా మిలిటరీ వర్గాలు గుర్తించాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ లు సమావేశం కానున్న తరుణంలో ఉత్తర కొరియా ఈ దుందుడుకు చర్యకు పాల్పడడం చర్చనీయాంశమైంది. జపాన్, చైనాలతోపాటు అమెరికాకు కూడా సూచన ప్రాయంగా తన శక్తిని తెలిపేందుకే ఉత్తర కొరియా ఈ దుస్సాహసానికి పూనుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చైనా సాయంతో తమను ఎదుర్కోవాలని, తమను నియంత్రించాలని చూడడం కాదు.. దమ్ముంటే సొంతంగా బరిలోకి దిగాలని, తమను అడ్డుకోవాలంటూ ఓ హెచ్చరికను ఉత్తర కొరియా తన క్షిపణి ప్రయోగం ద్వారా చెప్పకనే చెప్పినట్లు భావిస్తున్నారు.
ప్రపంచ పెద్దన్న అమెరికా హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇప్పటి వరకు ఉత్తర కొరియా ఐదు అణు పరీక్షలు నిర్వహించింది. తమ దేశ అణ్వస్త్ర సామర్థ్యం ఏమిటో ప్రపంచానికి ముఖ్యంగా అమెరికాకు చాటి చెప్పేందుకే ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఇలా వరుస క్షిపణి పరీక్షలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మరి అమెరికా ఈ విషయంలో ఎలాంటి చర్య తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.