అమెరికా మీద పగతో.. చైనా ప్రజలకు చుక్కలు చూపిస్తోన్న కిమ్?
అమెరికాపై పగతో రగిలిపోతున్న ఉత్తకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. వరుసగా అణు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ చైనా ఈశాన్య ప్రాంత ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు.
ప్యాంగ్యాంగ్: అమెరికాపై పగతో రగిలిపోతున్న ఉత్తకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. వరుసగా అణు, క్షిపణి పరీక్షలతో శత్రుదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
అయితే మరోవైపు ఈ పరిస్థితులు చైనాలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు కూడా చుక్కలు చూపిస్తున్నాయి.. ప్రాణ భయంతో వణికిస్తున్నాయి. ఉత్తరకొరియాతో సరిహద్దు పంచుకుంటున్న ఈశాన్య చైనాలోని మూడు ప్రావిన్సుల ప్రజలకు కిమ్ సాగిస్తున్న ఎడతెగని అణుపరీక్షలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆ మద్య ఉత్తరకొరియా ఏకంగా హైడ్రోజన్ బాంబుని పరీక్షించడంతో ఈ ప్రాంత ప్రజానీకం మరింత హడలిపోయారు. వెంటనే బహిరంగంగా తమ నిరసనను కూడా తెలియజేశారు. ఉత్తరకొరియా అణుపరీక్షలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఉత్తరకొరియా సాగిస్తున్న క్షిపణి పరీక్షలపై ఈశాన్య చైనా ప్రాంతానికి చెందిన ఉద్యమకారుడు యు యెన్ఫెంగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబుని పరీక్షించిన సమయంలో 5.8 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఆయన తెలిపారు.
ఉత్తరకొరియా నియంత కిమ్ చర్యలు మిత్రదేశమే అయినా.. చైనాకు కూడా భయంగొలిపే విధంగా ఉన్నాయని, దేశాల సరిహద్దుల్లో అణు పరీక్షలు నిర్వహించకూడదని, ఉత్తరకొరియా ఈ నిబంధనను పాటించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
అణ్వస్త్ర ప్రయోగాలు, క్షిపణి పరీక్షల వల్ల ఈశాన్య చైనా ప్రాంతంలో రేడియో ధార్మికత పెరుగుతోందని, ఈ పరిస్థితుల వల్ల సరిహద్దు ప్రాంతంలోని అనేకమంది ప్రజలు వలస వెళ్తున్నారని యెన్ఫెంగ్ తెలిపారు.
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ చైనా సరిహద్దు ప్రాంతాలను స్మశానంగా మార్చేలా ఉన్నారని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమెరికాపై పగ సంగతి సరే.. మా పరిస్థితి ఏమిటంటూ వారు వాపోతున్నారు.