చలో మార్స్! లక్షకు పైగా భారతీయులు రెడీ, టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు!
మీకో విషయం తెలుసా? మార్స్ (అంగారక గ్రహం) యాత్ర కోసం లక్షకు పైగా భారతీయులు రెడీ అయ్యారు.
వాషింగ్టన్: మీకో విషయం తెలుసా? మార్స్ (అంగారక గ్రహం) యాత్ర కోసం లక్షకు పైగా భారతీయులు రెడీ అయ్యారు. ఇప్పటికే టిక్కెట్లు కూడా బుక్ చేసేసుకున్నారు. మొత్తం 1,38,899 మంది భారతీయులు అంగారకుడిని చేరుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వీళ్లందరికీ ఆన్లైన్ బోర్డింగ్ పాస్లు కూడా వచ్చేశాయి.
నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇన్సైట్' (ఇంటీరియర్ ఎక్స్ప్లోరేషన్ యూజింగ్ సీస్మిక్ ఇన్వెస్టిగేషన్స్, జియోడెసీ అండ్ హీట్ ట్రాన్స్పోర్ట్) మిషన్ వీరందరినీ అరుణ గ్రహంపైకి తీసుకెళ్లనుంది.
2018 మే 5న ఈ మిషన్ను లాంచ్ చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ యాత్ర కోసం 24,29,807 మంది ఆసక్తి కనబరుస్తుండగా.. జాబితాలో ఇండియా మూడో స్థానంలో నిలవడం విశేషం.
ఈ ప్రయోగం కోసం భారత్ నుంచి అంత పెద్ద మొత్తంలో ఆసక్తి కనబరచడం పెద్ద ఆశ్చర్యకర విషయమేమీ కాదు. మన ఇస్రో 'మంగళ్యాన్' మిషన్ను విజయవంతంగా పూర్తి చేయడంతోనే భారతీయుల్లో అరుణగ్రహంపై పూర్తి అవగాహన ఏర్పడింది.

దీంతోపాటు అంతరిక్ష అంశాల్లో అమెరికా-ఇండియా సహకారం ఇటీవల మరింత బలపడటం కూడా దీనికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు. 6,76,773 మందితో అమెరికా తొలి స్థానంలో.. 2,62,752 మందితో చైనా రెండో స్థానంలో నిలిచినట్లు నాసా బుధవారం పేర్కొంది.
అయితే.. వీరంతా నేరుగా మార్స్పైకి వెళ్లడం లేదులెండి. ఈ 24 లక్షల మంది పేర్లను ఓ చిన్న సిలికాన్ వేఫర్ మైక్రోచిప్లో పొందుపరిచి.. ఆ చిప్ను ల్యాండర్కు సంధానం చేయనున్నారు.
ఎలక్ట్రాన్ బీమ్ సాయంతో వెంట్రుకలో వెయ్యో వంతు వ్యాసంతో ఆ అక్షరాలను తీర్చిదిద్దనున్నారు. నాసా ఇన్సైట్ మిషన్ 720 రోజుల పాటు సాగనుంది. ఇది రెడ్ ప్లానెట్పై ఉన్న పరిస్థితులు, అక్కడి భూకంపాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తుంది.












Click it and Unblock the Notifications