పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్ ఎన్నిక: మనీలాండరింగ్ కేసులో ఊరట
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో మరోసారి ప్రభుత్వం మారింది. ఇమ్రాన్ ఖాన్ దిగిపోయిన క్రమంలో పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రిగా పీఎంఎల్(ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన షెహబాజ్కు పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ప్రధాని ఎన్నిక ఏకగ్రీవమైంది. అంతేగాక, పీటీఐ తరపునన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న షా మొహమ్మద్ ఖురేషీ ఈ పోటీ నుంచి తప్పుకోవడంతో షెహబాజ్కు లైన్ క్లియర్ అయ్యింది.
కాగా, మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న షెహబాజ్ షరీఫ్ తోపాటు ఆయన కుమారుడికి పాకిస్థాన్ కోర్టులో ఊరట లభించింది. న్యాయస్థానానికి హాజరుతోపాటు అరెస్టుకు సంబంధించి ముందస్తు బెయిల్ ను పొడిగించింది కోర్టు. ఈ కేసును ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. దీంతో పీఎంఎల్(ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్కు ఉన్న అన్ని చిక్కులూ తొలగినట్లయింది.
అంతకుముందు పరిణామాలు గమనించినట్లయితే.. పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు అక్కడి జాతీయ అసెంబ్లీ సోమవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశమైంది. ఇతర పార్టీల సభ్యులందరూ హాజరైనప్పటికీ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్షాఫ్(పీటీఐ) సభ్యులు మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
#WATCH | Shehbaz Sharif, Pakistan opposition leader, elected new PM
— ANI (@ANI) April 11, 2022
Source: PTV pic.twitter.com/lYcOeYbwQp
పీటీఐ పార్టీ నేతలంతా మూకుమ్మడి రాజీనామా చేసి, ప్రధాని ఎన్నికను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దొంగలతో కలిసి జాతీయ అసెంబ్లీలో కూర్చోలేమంటూ ఇమ్రాన్ ఖాన్ తోపాటు పీటీఐ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ షెహబాజ్ షరీఫ్ ఎవరంటే..?
పాక్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్.. 70 సంవత్సరాల సీనియర్ రాజకీయనేత. పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధినేత. మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు స్వయానా సోదరుడు. పనామా పేపర్స్ కుంభకోణం ఆరోపణలతో నవాజ్ షరీఫ్ క్రియాశీలక రాజకీయాలకు దూరమైన తరువాత ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. ఇదివరకు పంజాబ్ ప్రావిన్స్కు ముఖ్యమంత్రిగా పని చేశారు. పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలిపోవడంలో కీలక పాత్రను పోషించారు.
కాగా, షెహబాజ్ పూర్వీకులది జమ్మూ కాశ్మీర్. అనంత్నాగ్ వారి స్వస్థలం. వ్యాపార కార్యకలాపాల కోసం అనంత్నాగ్ నుంచి పంజాబ్ అమృత్సర్ సమీపంలోని జటీ ఉమ్రా పట్టణానికి తరలి వెళ్లింది. అక్కడే స్థిరపడింది. ప్రత్యేక దేశంగా ఏర్పాటైన అనంతరం ఈ ప్రాంతం మొత్తం పాకిస్తాన్లో విలీనమైంది. లాహోర్కు సమీపంలో ఉంటుందీ జటీ ఉమ్రా. ఇప్పటికీ షరీఫ్ బంధువులు ఇక్కడే నివసిస్తోన్నారు. ఒకే కుటుంబం నుంచి తొలుత నవాజ్ షరీఫ్.. తాజాగా షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్కు ప్రధానమంత్రులయ్యారు.