జేఎన్యూలో హింస.. భారత్లో అసహనానికి గుర్తు.. పాక్ మంత్రి ప్రేలాపనలు..
సొంతదేశంలో హింసను కట్టడిచేయలేని పాకిస్తాన్.. భారత్ లో చోటుచేసుకుంటున్న ఘటనలపై ఘాటు వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్ యూ)లో విద్యార్థులు, ప్రొఫెసర్లపై దుండుగులు దాడిచేసిన ఘటనపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మొహ్మద్ ఖురేషీ ప్రేలాపనలు పేలారు.
జేఎన్యూలో దాడులు.. భారత్ లో పెరిగిపోతున్న అసహనానికి గుర్తు అని ఖురేషీ అన్నారు. ''ఇండియాలోని యూనివర్సిటీ క్యాంపస్ లు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ముఠాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నాయి.. పోలీసులు కూడా పిచ్చిగా వారితో చేతులు కలిపారు.. ఫాసిస్టు భావజాలం పెరిగిపోయినప్పుడే ఇలా జరుగుతుంది.. జేఎన్ యూలో స్డూడెంట్లు, ప్రొఫెసర్లపై దాడి.. భారత్ లో పెరిగిపోతున్న అసహనానికి గుర్తు''అని ఖురేషీ సోమవారం ట్వీట్ చేశారు. పాక్ మంత్రి ప్రకటనపై బీజేపీ నేతలు మండిపడ్డారు.
ముసుగులు ధరించిన 50 మందికిపైగా దుండలులు ఆదివారం రాత్రి జేఎన్ యూ క్యాపస్ లోకి ప్రవేశించి.. విద్యార్థులు, ప్రొఫెసర్లపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. స్డూడెంట్ యూనియన్ లీడర్ ఐషే ఘోష్ తోపాటు 18 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. జేఎన్యూ హింసాకాండపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. ఇన్వెస్టిగేషన్ బాధ్యతను క్రైంబ్రాంచ్ విభాగానికి అప్పగించారు.