దిగొచ్చింది: కుల్భూషణ్ జాధవ్కు కాన్సులర్ యాక్సెస్ ఇస్తున్నట్లు పాక్ ప్రకటన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జైలులో ఉన్న కుల్భూషణ్ జాధవ్కు వెంటనే భారత కాన్సులేట్ యాక్సెస్ ఇవ్వాలంటూ అంతర్జాతీయ కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పాక్ ప్రభుత్వం కదిలింది. పాకిస్తాన్ చట్టాలను అనుసరించి కుల్భూషణ్ జాదవ్కు కాన్సులేట్ యాక్సెస్ కల్పిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇదే విషయమై పాక్ అధికారులు కుల్భూషణ్ జాధవ్కు కూడా తెలిపినట్లు వెల్లడించారు. వియన్నా కన్వెన్షన్ ప్రకారం ఇది జరుగుతుందని పాక్ అధికారులు అర్థరాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.
పాకిస్తాన్లోని మిలటరీ జైలులో శిక్ష అనుభవిస్తున్న జాధవ్కు కాన్సులర్ యాక్సెస్ను పలుమార్లు నిరాకరించింది పాకిస్తాన్. ఇక అంతర్జాతీయ కోర్టు కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే అది జరగాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకొచ్చింది. మార్చి 2016లో జాదవ్ అరెస్టు అయినప్పటి నుంచి భారత దౌత్యాధికారులు అతనితో మాట్లాడేందుకు పాక్ మిలటరీ అనుమతించలేదు. ఇక మిలటరీ కోర్టు జాదవ్కు మరణశిక్ష విధించడంతో భారత్ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది.
మరో రెండ్రోజుల్లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ అమెరికా పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో జాధవ్ను దౌత్యాధికారులు కలిసే అవకాశం ఇవ్వడం విశేషం. అమెరికా పర్యటన సందర్భంగా జూలై 22న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ భేటీ కానున్నారు. అంతేకాదు ముంబై దాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవా హఫీజ్ సయీద్ను కూడా అరెస్టు చేయడం జరిగింది. అంతర్జాతీయ కోర్టు తీర్పును అమలు చేస్తూనే పాక్ చట్టాల ప్రకారం జరగాల్సినవి జరుగుతాయని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే కుల్భూషణ్ జాదవ్ పై అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పును పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ స్వాగతించారు. అయితే అతను తప్పు చేయలేదని, విడుదల చేయమని కానీ, లేక భారత్కు అప్పచెప్పమని కానీ తీర్పులో పేర్కొనకపోవడం నిజంగానే హర్షణీయం అంటూ ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.