తన భార్యను కలిసేందుకు కుల్భూషణ్ జాదవ్కు పాక్ అంగీకారం
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ తన భార్యతో సమావేశమయ్యేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించింది. మానవత్వ కోణంలో జాదవ్ తన భార్యను కలుసుకునేందుకు ఒప్పుకున్నట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం వెల్లడించింది.
ఇందుకు సంబంధించిన లేఖను శుక్రవారం ఇస్లామాబాద్లోని భారత దౌత్య కార్యాలయానికి పంపించనున్నట్లు పాక్ అధికారులు తెలిపారు. జులై నెలలో జాదవ్ తన కుటుంబసభ్యులను కలుసుకునేందుకు అనుమతివ్వాలని భారత ప్రభుత్వం పాక్ అధికారులను కోరింది. కానీ అందుకు పాక్ నిరాకరించింది.
ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ విదేశాంగ శాఖకు వ్యక్తిగతంగా లేఖ కూడా రాశారు. జాదవ్ తల్లి పాక్ వచ్చేందుకు వీసా మంజూరు చేయాల్సిందిగా ఆమె లేఖలో కోరారు.
గూఢచర్యం ఆరోపణలతో భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్కు పాక్ సైనిక కోర్టు ఏప్రిల్ నెలలో మరణశిక్షను విధించిన విషయం తెలిసిందే. దీనిపై భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు జాదవ్ మరణశిక్షపై స్టే విధించింది.