పర్వతాల్లో పాక్ 2వరాజధాని: ఇస్లామాబాద్కు సొరంగం
ఇస్లామాబాద్: మార్గల్లా పర్వత ప్రాంతంలో పాకిస్తాన్ మరో రాజధానిని నిర్మించేందుకు సిద్ధమైంది. 12 బిలియన్ డాలర్లతో ఈ రెండో రాజధానిని నిర్మించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ కొత్త రాజధానిని ప్రస్తుత రాజధాని ఇస్లామాబాద్తో సొరంగ మార్గం ద్వారా కలపనుంది. భారీ ప్రాజెక్టులో భాగంగా పలు నిర్మాణ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు.
ఈ రెండో రాజధాని ప్రాజెక్టు ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ డైరెక్షన్లో జరుగుతున్నాయట. రాజధాని అభివృద్ధి సంస్థ ఇందు కోసం అహర్నిషలు కృషి చేస్తోందట. పాకిస్తాన్ రెండో రాజధానికి సంబంధించి మీడియాలో వార్తలు వచ్చాయి. రావల్పిండి - ఇస్లామాబాద్ మధ్య రెండు రింగు రోడ్డులు, రావల్పిండిలోని రావత్ వద్ద ఒక కొత్త ఎయిర్పోర్టు నిర్మాణం కూడా ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.
కొత్త విమానాశ్రయం లాహోర్-ఇస్లామాబాద్ మోటర్ వేకు అనుసంధానిస్తారు. బ్లూ ఏరియా నుంచి రావత్ వరకూ ఉన్న ఇస్లామాబాద్ హైవేను 8 నుంచి పది లైన్లకు విస్తరించడంతోపాటు రోడ్డుకు ఇరువైపులా దుబాయ్లోని షేక్ జాయెద్ రోడ్డు తరహాలో బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలను కూడా నిర్మించనున్నారు.
ఇస్లామాబాద్ హైవేకు ఇరువైపుల ఉన్న ప్లాట్లను వాణిజ్య అవసరాలకు ఇవ్వడం ద్వారా భారీ మొత్తంలో డాలర్లను రాబట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.