భారత్ లో రహస్య అణు నగర నిర్మాణం.. అణ్వాయుధాల సేకరణ : పాకిస్తాన్ ఆరోపణ
భారత్ రహస్య అణు నగరాన్ని నిర్మిస్తున్నదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియాఆరోపించారు. దీంతోపాటు అణ్వాయుధాలను సేకరించి నిల్వ చేస్తోందని కూడా పేర్కొంది.
ఇస్లామాబాద్: భారత్ రహస్య అణు నగరాన్ని నిర్మిస్తున్నదని పాకిస్తాన్ ఆరోపించింది. దీంతోపాటు అణ్వాయుధాలను సేకరించి నిల్వ చేస్తోందని కూడా పేర్కొంది. భారత్ చర్యల ద్వారా ప్రాంతీయంగా వ్యూహాత్మక సమతౌల్యం దెబ్బతింటోందని పాక్ తెలిపింది.
పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆరోపణలు చేశారు. భారత్ ఖండాంతర క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ దక్షిణాసియా ప్రాంతంలో సమతౌల్యానికి విఘాతం కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.
భారత్ చర్యలపై దృష్టిసారించడంతోపాటు సంప్రదాయ, సంప్రదాయేతర ఆయుధ సంపత్తిని వేగంగా పెంపొందించుకుంటున్న తీరుపై తనిఖీ నిర్వహించాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు.
పాకిస్తాన్ ను ఏకాకిని చేయాలనే భారత్ వ్యూహం బెడిసికొట్టిందని నఫీజ్ జకారియా చెప్పారు. శాంతిని నెలకొల్పేందుకు పాకిస్తాన్ చేస్తున్న కృషిని భారత్ కూడా అనుసరించాలని ఆయన కోరారు.
భారత్ తో సహా పొరుగు దేశాలతో శాంతియుత సంబంధాలను పెంపొందించుకోవాలని తాము ప్రయత్నిస్తుంటే. భారత్ చర్చలకు చొరవ చూపడం లేదని ఆరోపించారు. భారత్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతోపాటు ఉగ్రవాదులకు నిధులు అందజేస్తూ.. పాకిస్తాన్ లో ఉగ్రవాదుల కార్యకలాపాలకు సహకరిస్తోందని నఫీజ్ జకారియా ఆరోపించారు.
ఆరోపణలు నిరాధారం : భారత్
అయితే పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా ఆరోపణలను భారత విదేశాంగ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఖండించారు. పాక్ చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలేనని ఆయన పేర్కొన్నారు.