పాకిస్తాన్ ఎవరిది..?: హోరాహోరీ పోరు
Pakistan elections 2024: పొరుగుదేశం పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. అధికారంలోకి వచ్చేదెవరు? ప్రతిపక్షంలో కూర్చొనేది ఎవరు? స్పష్టమౌతోంది. ప్రధానంగా మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగుతోంది.
336 స్థానాలు ఉన్న పాకిస్తాన్ పార్లమెంట్లో 266 నియోజకవర్గాలకు మాత్రమే పోలింగ్ నిర్వహించారు. 60 స్థానాలు మహిళలు, మరో 10 సీట్లు మైనారిటీలకు రిజర్వ్ చేశారు. అక్కడ ఓటింగ్ ఉండదు. మిగిలిన గురువారమే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. బ్యాలెట్ పద్ధతిన తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆ దేశ ఓటర్లు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య దాడులు ప్రతిదాడులు జరిగాయి. ఖైబర్ ఫక్తున్ఖ్వా, పంజాబ్ ప్రావిన్స్లల్లో హింసాత్మక వాతావరణం నెలకొంది.
ఈ ఉద్రిక్తతల మధ్యే ఈ ఉదయం నుంచి పాకిస్తాన్లో ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. బ్యాలెట్లను లెక్కిస్తోన్నారు అక్కడి సిబ్బంది. ఈ ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 93 స్థానాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టగా.. 36 చోట్ల పీటీఐ ఆధిక్యతలో కొనసాగుతోంది.
మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ పార్టీ రెండోస్థానంలో నిలిచింది. ఈ పార్టీ అభ్యర్థులు 31 చోట్ల లీడ్లో ఉన్నారు. బిలావల్ భుట్టో జర్దారి నాయకత్వాన్ని వహిస్తోన్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మూడోస్థానానికి పరిమితమైంది. 18 స్థానాల్లో పీపీపీ అభ్యర్థుల ఆధిక్యతలో ఉన్నారు.
అనేక కేసుల వల్ల జైలు శిక్షను ఎదుర్కొంటోన్న ఇమ్రాన్ ఖాన్కు ఈ ఎన్నికలు ఊరట కల్పించినట్టయింది. ఆధిక్యత క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారాన్ని కైవసం చేసుకుంటారనేే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ ఎన్నికల్లో పోటీకి దిగిన నవాజ్ షరీఫ్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పకపోవచ్చని అంటున్నారు.












Click it and Unblock the Notifications