యుద్ధమే వస్తే జస్ట్ 4 రోజుల్లో ఫినిష్: కేంద్రానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్
India Pakistan War: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం.. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటోన్నాయి. యుద్ధ సన్నాహాలు సైతం చేపట్టాయి.
ఈ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ బరితెగిస్తోంది. తన తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. నిన్నటి వరకూ జమ్మూ కాశ్మీర్ సమీపంలో నియంత్రణ రేఖ (LoC) పొడవునా కాల్పులకు తెగబడుతూ వస్తోంది పాకిస్తాన్ సైన్యం. భారత ఆర్మీ పోస్టులపై తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరిపింది. యుద్ధానికి రెచ్చగొడుతోంది.

వ్యూహాత్మకంగా అత్యంత సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలుగా భావించే జమ్మూ జిల్లా పర్గ్వాల్ సెక్టార్ పరిధిలో అంతర్జాతీయ సరిహద్దు పొడవునా గల భారత ఆర్మీ పోస్టులపై కొద్దిరోజుల కిందటే ఈ కాల్పులకు దిగింది పాకిస్తాన్. దీన్ని భారత జవాన్లు విజయవంతంగా తిప్పి కొట్టారు.
నిజానికి భారత్తో పూర్తిస్థాయి యుద్ధానికి దిగే సామర్థ్యం పాకిస్తాన్కు లేదు. ఆయుధ కొరతను ఎదుర్కొంటోందా శతృదేశం. నాలుగు రోజుల యుద్ధానికి మాత్రమే సరిపడే ఆయుధాలు ఉన్నాయని, అంతకుమించి యుద్ధాన్ని కొనసాగించే స్థోమత పాక్ సైన్యానికి ఎంతమాత్రమూ లేదని తేలింది.
పాకిస్తాన్ వద్ద గల ఆయుధ సంపత్తిపై కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యురో.. ఓ సమగ్ర నివేదికను రూపొందించింది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న మరుక్షణమే పాకిస్తాన్ రక్షణ శాఖ వ్యవస్థపై నిఘా వేసింది. గూఢచారులను రంగంలోకి దింపింది. పాక్ ఆర్మీ గురించి కూపీలాగింది.
వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం- యుద్ధంలో ప్రధానంగా వినియోగించే 155 ఎంఎం ఆర్టిల్లరీ షెల్స్, 122 ఎంఎం రాకెట్స్ చాలా తక్కువ పరిమాణంలో ఉన్నాయి. పాకిస్తాన్ వీటి వినియోగం మీదే ఎక్కువగా ఆధారపడింది.
ఇదివరకు 155 ఎంఎం షెల్స్ గానీ, ఎం 109 హొవిట్జర్ యుద్ధట్యాంకులు గానీ, బీఎం 21 రాకెట్ లాంచర్లు గానీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ- అందులో మెజారిటీ వాటాను ఉక్రెయిన్కు విక్రయించింది. మేగజైన్లు దాదాపుగా ఖాళీగా ఉంటోన్నాయి. ఈ నెల 2వ తేదీన స్పెషల్ కార్ప్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్లో ఆయా విషయాలన్నీ కూడా ప్రస్తావనకు వచ్చినట్లు ఇంటెలిజెన్స్ బ్యురో తెలిపింది.
తన దేశానికి ఆయుధ సంపత్తిని తయారు చేసే బాధ్యతను చూసుకుంటోంది పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో చాలాకాలంగా ఇది పూర్తిస్థాయిలో కార్యకలాపాలను నిర్వహించట్లేదని ఐబీ నివేదిక అంచనావేసింది. అలాగే- ద్రవ్యోల్బణం భారీగా పెరగడం, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్మీకి సరఫరా చేయాల్సిన నిత్యావసర సరుకుల్లోనూ కోత పెట్టినట్లు పేర్కొంది.
సైనికుల శారీరక ధారుఢ్యాన్ని పరీక్షించడానికి తరచూ నిర్వహించే ఆర్మీ ఎక్సర్సైజులు, వార్ గేమ్స్.. వంటివి కొంతకాలంగా స్తంభించిపోయాయని, పెట్రోల్- డీజిల్ కొరత కారణంగా పలు సైనిక వాహనాలను వినియోగించట్లేదని కూడా ఇంటెలిజెన్స్ బ్యురో తన నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications