జైషె ఉగ్రవాదులు నన్ను కూడా చంపాలని చూశారు: భారత్ పై దాడులకు పావుగా..: పర్వేజ్ ముషార్రఫ్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ పై భారత వైమానిక దళం చేపట్టిన దాడులు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తొలిసారిగా నోరు విప్పారు. జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చర్యలు తీసుకోవడాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. నిజానికి- జైషె ఉగ్రవాద సంస్థ ఓ పావు మాత్రమేనని, అసలు దోషులు పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్నారని ఆయన పరోక్షంగా విమర్శించారు.
యుఎస్ ఎయిర్ ఫోర్స్ లో అత్యాచారానికి గురయ్యా: యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలెట్
నన్ను కూడా మట్టుబెట్టే ప్రయత్నం..
పాకిస్తాన్ కు చెందిన నదీమ్ మాలిక్ అనే జర్నలిస్ట్ కు ఫోన్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్వేజ్ మాట్లాడారు. క్లుప్తంగా ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో ఆయన కొన్ని కీలక విషయాలను బయట పెట్టారు. 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా పని చేసిన సమయం నాటికే జైషె మహమ్మద్ సంస్థ వేళ్లూనుకుపోయిందని అన్నారు. చివరికి- తనను కూడా హతమార్చడానికి జైషె మహమ్మద్ ఉగ్రవాదులు రెండుసార్లు ప్రయత్నించారని చెప్పారు. 2003లో కొన్ని రోజుల వ్యవధిలో తనను మట్టుబెట్టడానికి జైషె ఉగ్రవాదులు విఫలయత్నం చేశారని అన్నారు. తన అదృష్టం బాగుండి, జైషె కుట్రలు ఫలించలేదని ఆయన చెప్పారు.
భారత్ పై దాడులకు పావుగా..
పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాల్సిన పాకిస్తాన్ ఏ నాడూ ఆ పని చేయలేదని పర్వేజ్ ముషార్రఫ్ చెప్పారు. భారత్ పై పగ తీర్చుకోవాలని చూసిందే తప్ప, స్నేహపూరకంగా ఏనాడూ మెలగలేదని అన్నారు. తన హయాంలో, తన అధ్యక్ష కార్యాలయంలోనే భారత్ పై దాడులకు కుట్రలు పన్నిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఇంటెలిజెన్స్ విభాగం.. దృష్టి ఎప్పుడూ భారత్ పైనే ఉండేదని, అక్కడ అల్లర్లు సృష్టించడానికి పథకాలు రచించేదని చెప్పారు. భారత్ పై ఉగ్రవాద దాడులు చేయడానికి పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు జైషె మహమ్మద్ ను ఒక పావుగా వాడుకున్నారని ముషార్రఫ్ చెప్పారు. ఉగ్రవాదులకు తగిన ఆర్థిక సహాయ, సహకారాలు ఇంటెలిజెన్స్ నుంచే అందేవని అన్నారు.
పాక్ అధ్యక్షుడిగా ఉగ్రవాదాన్ని అణచివేయలేకపోయా..
తన హయాంలో జైషెను అణగదొక్కడానికి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉండేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తనకు స్వేచ్ఛ ఉండేది కాదని పరోక్షంగా చెప్పారు. ఉండి ఉంటే, జైషే ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుని ఉండేవాడనని ముషార్రఫ్ అన్నారు. `నేను పదవిలో ఉన్న రోజులు వేరు.. `అని ఆయన బదులిచ్చారు. తన హయాంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉండేదని, పరస్పరం బాంబులు విసురుకున్న సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయని చెప్పారు. ఆ పరిస్థితుల్లో తాను స్వదేశంలో తలెత్తిన ఉగ్రవాద సమస్యపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయానని అన్నారు.