పాక్ అధ్యక్షుడి విచక్షణాధికారాల ప్రయోగం- అర్ధరాత్రి సంచలనం నిర్ణయం
India Pakistan War: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం.. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటోన్నాయి. యుద్ధ సన్నాహాలు సైతం చేపట్టాయి.
ఈ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ బరితెగిస్తోంది. తన తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. నిన్నటి వరకూ జమ్మూ కాశ్మీర్ సమీపంలో నియంత్రణ రేఖ (LoC) పొడవునా కాల్పులకు తెగబడుతూ వస్తోంది పాకిస్తాన్ సైన్యం. భారత ఆర్మీ పోస్టులపై తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరిపింది. యుద్ధానికి రెచ్చగొడుతోంది.

వ్యూహాత్మకంగా అత్యంత సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలుగా భావించే జమ్మూ జిల్లా పర్గ్వాల్ సెక్టార్ పరిధిలో అంతర్జాతీయ సరిహద్దు పొడవునా గల భారత ఆర్మీ పోస్టులపై కొద్దిరోజుల కిందటే ఈ కాల్పులకు దిగింది పాకిస్తాన్. దీన్ని భారత జవాన్లు విజయవంతంగా తిప్పి కొట్టారు.
భారత్తో యుద్ధ మేఘాలు తీవ్రతరమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ను అత్యవసరంగా సమావేశపర్చనున్నారు. దీనికి అవసరమైన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సాయంత్రం 5 గంటలకు రాజధాని ఇస్లామాబాద్లో పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశం కానుంది.
ఈ మేరకు పార్లమెంట్ హౌస్ సెక్రెటరీ జనరల్ తాహిర్ హుస్సేన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 54, క్లాజ్ (1)లో పొందుపరిచిన ప్రత్యేక విచక్షణాధికారాల ఆధారంగా అధ్యక్షుడి భవనం ఈ నోటిఫికేషన్ వెలువడించినట్లు ఇందులో పొందుపర్చారు.
పాకిస్తాన్ ముస్లిం లీగ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ముత్తాహిదా క్వామి మూమెంట్, సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్, జామెతె ఉలేమా-ఇ- ఇస్లామ్ వంటి పార్టీల సభ్యులు పార్లమెంట్ సమావేశానికి హాజరు కానున్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత చోటు చేసుకుంటోన్న పరిణామాలపై పాకిస్తాన్ పార్లమెంట్ చర్చించే అవకాశం ఉంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి విషయంలో తమ దేశాన్ని భారత్ తప్పుపట్టడం పట్ల పాకిస్తాన్ పార్లమెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదిస్తుందని అక్కడి మీడియా చెబుతోంది. ఈ దాడి తరువాత భారత్ తీసుకున్న అనేక నిర్ణయాలను సమీక్షించనుంది. ప్రత్యేకించి ఇండస్ వాటర్ ట్రీటీపై పాకిస్తాన్ పార్లమెంట్ చర్చించనున్నట్లు తెలిపింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత తన ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాల గురించి ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పార్లమెంట్లో వివరిస్తారని అంటున్నారు. మున్ముందు తీసుకోబోయే నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై సభ ఆమోదం కోరుతారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications