భారత్ పై పాక్ ఏడుపులు- అమెరికా చర్యతో ఉలికిపాటు
Pahalgam Terror Attack: ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.
ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. పాకిస్తాన్పై కఠిన ఆంక్షలను విధించింది. ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్పోస్ట్ను మూసివేయడమే కాకుండా దేశంలో నివస్తోన్న పాకిస్తానీయులనూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది.

ఈ దాడి ఘటనలో భారత్ తాజాగా తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. విదేశీ ఉగ్రవాద సంస్థ (FTO), స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ (SDGT)గా ప్రకటించింది. దీనిపై ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో.. అల్-షబాబ్, బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS), హమాస్, హిజ్బుల్లా, ఇస్లామిక్ జిహాద్ యూనియన్ వంటి ఇతర భయానక ఉగ్రవాద సంస్థల జాబితాలో టీఆర్ఎఫ్ కూడా చేరినట్టయింది. అటు పాకిస్తాన్ కూ బిగ్ షాక్ ఇచ్చినట్టే అయింది.
లష్కరే తోయిబాకు అనుబంధంగా కొనసాగుతున్న టీఆర్ఎఫ్ ను అమెరికా.. విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. దీనిపై స్పందిస్తూ భారత్ ఆరోపణలను ఖండించింది. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. దీనిపై తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.
టీఆర్ఎఫ్, లష్కరే తోయిబాతో తమకు ఎటువంటి సంబంధం లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. లష్కరే తోయిబాను తాము ఇదివరకే నిషేధించామని గుర్తు చేసింది. దానికి అనుబంధంగా లేదా.. పరోక్షంగా సంబంధాలు ఉన్న సంస్థల గుర్తింపును రద్దు చేశామని, వాటి నాయకులను అరెస్టు చేసి విచారణ జరిపామని పేర్కొంది.
జమ్మూ కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ తన వాదనను సమర్థించుకుంది. తమపై బురదజల్లడానికి భారత్ ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేస్తోందని విమర్శించింది. పహల్గామ్ ఉగ్రవాద ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశామని, అయినప్పటికీ తమకు చెడ్డపేరును అపాదించేలా, అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
బలూచిస్తాన్ లో పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడులకు పాల్పడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA)కి చెందిన మజీద్ బ్రిగేడ్ వంటి సంస్థలను కూడా ఉగ్రవాద జాబితాలో చేర్చాలని పాకిస్తాన్ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ దేశాలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించింది.












Click it and Unblock the Notifications