పాకిస్థాన్ షాకింగ్ నిర్ణయం.. మార్చి 31 వరకు..
పాకిస్థాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అఫ్గాన్ తాలిబాన్ దళాలు 2,600 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న సరిహద్దు మార్గంలో 53 ప్రదేశాలపై దాడి చేయడంతో పాకిస్థాన్ 'ఆపరేషన్ గజబ్ లిల్ హక్' ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ లో భాగంగా, తాలిబాన్ల ఆయుధాగారాన్ని పాకిస్థాన్ ధ్వంసం చేసిందని ప్రభుత్వ మీడియా నివేదించింది. పాకిస్థాన్ సైన్యం "శక్తివంతమైన ప్రతి దాడులు" నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ రంగ పాకిస్థాన్ టెలివిజన్ (PTV) తెలిపింది.
కేంద్ర సమాచార శాఖ మంత్రి అటౌల్లా తరార్ ప్రకారం.. గత వారం "రెచ్చగొట్టని కాల్పుల" నేపథ్యంలో అఫ్గాన్ తాలిబాన్ పై ఈ ఆపరేషన్ మొదలైంది. సోమవారం ఆయన మాట్లాడుతూ, "ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుండి పాకిస్థాన్ సాయుధ దళాలు 182 అఫ్గాన్ తాలిబాన్ పోస్టులను ధ్వంసం చేశాయి, 31 పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి. 415 మంది అఫ్గాన్ తాలిబాన్ సిబ్బంది మరణించగా, 580 మందికి పైగా గాయపడ్డారు" అని వివరించారు.
ఆపరేషన్ కారణంగా పాకిస్థాన్ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) యుద్ధ విమానాలకు అనుగుణంగా మార్చి 3 నుండి మార్చి 31 వరకు రోజువారీ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కరాచీ, లాహోర్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్స్ (FIRs)లోని కొన్ని ఎయిర్ రూట్లను వాణిజ్య కార్యకలాపాలకు అందుబాటులో లేకుండా చేసినట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. పాకిస్థాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ (PAA) "సైనిక విన్యాసాల" కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం ఈ ఘర్షణకు ముగింపు కనిపించడం లేదు. పాకిస్థాన్ దళాలు తాలిబాన్ భద్రతా వ్యవస్థను బలహీన పరుస్తున్నాయి. ఘర్షణలు ప్రారంభమైన వెంటనే, ఖతార్, సౌదీ అరేబియాతో సహా గల్ఫ్ దేశాలు శాంతి చర్చలు జరపడానికి ప్రయత్నించాయి. అయినప్పటికీ, ఇరాన్-యుఎస్-ఇజ్రాయెల్ వివాదం కారణంగా మధ్య ప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు తక్షణ పరిష్కారం దొరకలేదు.












Click it and Unblock the Notifications