పాకిస్తాన్: 'మాకు వ్యతిరేకంగా వార్త రాస్తే చంపేస్తాం'
కరాచీ: పాకిస్థాన్ హక్కుల కార్యకర్త, విలేకరి జమాన్ మసూద్ ద్విచక్ర వాహనం పైన వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి హతమార్చారు. దీనిపై పాక్ ఉగ్రవాద సంస్థ తాలిబన్ ప్రకటన చేసింది. ఆ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత స్పందించింది.
మసూద్ను తామే హత్య చేశామని పేర్కొంది. అతడు పత్రికల్లో తమకు వ్యతిరేకంగా రచనలు చేయడం వల్లే హతమార్చామని, అతనిలాగే చాలామంది జర్నలిస్టులు తమ టార్గెట్లో ఉన్నారని తెలిపింది. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది.
తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే చంపేస్తామని తాలిబన్ కమాండర్ సైఫుల్లా హెచ్చరించాడు. అయితే తాలిబన్లు వ్యవహరించిన తీరుపై పాకిస్తాన్ మానవ హక్కుల సంస్థ తీవ్రంగా మండిపడింది. ఈ కేసు విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, పారదర్శకతతో కూడిన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.
జమాన్ మసూద్ను చంపిన వారిని శిక్షించాలని, వారిని న్యాయస్థానం ముందుకు ఈడ్చాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఓ తుపాకీ పట్టుకొని వచ్చిన ఓ వ్యక్తి జమాన్ మసూద్ను చంపి వెళ్లాడు.