అతిపెద్ద ట్రెయినింగ్ స్థావరంపై దాడి: టెర్రరిస్ట్లు ఎక్కడ, ఎలా శిక్షణ పొందుతారో చూడండి
ఢిల్లీ/ఇస్లామాబాద్: పుల్వామా దాడికి ప్రతీకారచర్యగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు పాకిస్తాన్లోని బాలాకోట్ తీవ్రవాద స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అతిపెద్ద ట్రెయినింగ్ క్యాంప్ ఉంటుంది. ఇది అతిపెద్ద శిక్షణ ప్రాంతం కాబట్టి ఇది తీవ్రవాదులకు కోలుకోలేని దెబ్బే.
బాలాకోట్లో ఆరు నుంచి ఏడు ఎకరాల్లో ట్రెయినింగ్ క్యాంప్
బాలాకోట్లోని ఆరు నుంచి ఏడు ఎకరాల్లో ఈ ట్రెయినింగ్ క్యాంప్ ఉంటుంది. ఇది ఎల్వోసీకి సమీపంలో ఉంటుంది. ఈ ఉగ్రవాద శిక్షణా స్థావరాల్లో నిత్యం 600 మందికి పైగా ఉంటారు. దీనిపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు దాడులు నిర్వహించాయి. అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఫోటోలను ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి.
పదిహేనేళ్ల క్రితం ఉగ్రవాద శిబిరం ప్రారంభం
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)కు 80 కిలో మీటర్ల దూరంలో ఈ స్థావరం ఉంది. ఈ ఉగ్రవాద శిక్షణ స్థావరంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పైరింగ్ రేంజ్, స్విమ్మింగ్ పూల్, జిమ్నాజియం తదితర ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఇది కొండల్లో ఉంది. దట్టమైన కొండలు కావడంతో ఉగ్రవాద శిబిరాలు అంతగా కనిపించకుండా ఉంటాయి. బాలాకోట్లో ఉగ్రవాద శిక్షణ శిబిర నిర్మాణం 2003-2004లో ప్రారంభమైంది. నిష్ణాతులు ఉగ్రవాద దాడుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ మేరకు జైష్ ఏ మొహమ్మద్ తీవ్రవాదులకు శిక్షణ ఇస్తున్న ఫోటోలు, నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలు వెలుగు చూశాయి.
ట్రెయినింగ్ ఫోటోలు
మనేహ్రాలోని బాలాకోట్.. మార్కజ్ సయ్యద్ అహ్మద్ షహీద్లో జేఈఎం ట్రెయినింగ్ సెంటర్కు సంబంధించిన ఫోటో, మిలిటెంట్స్ మెయిన్ కాంప్లెక్స్ ఫోటోలతో పాటు అమెరికా, యూకే, ఇజ్రాయెల్ జాతీయ జెండాలకు చెందిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఉగ్రవాద శిక్షణ పొందేవారిలో ఈ దేశాలపై ఆగ్రహం రగిల్చేందుకు వీటిని ఉపయోగిస్తారు. అక్కడి మెట్లకు ఈ జెండాలు ఉన్నాయి. అలాగే, ఆయుధాలకు సంబంధించిన స్టోరేజ్ నిర్మాణం ఫోటో కూడా వెలుగు చూసింది. ఈ ఉగ్రవాద శిక్షణా స్థావరాలు పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ పర్యవేక్షణలో ఉంటాయని చెబుతున్నారు. ఇక్కడ వందలాది మంది శిక్షణ పొందుతున్నారు. మౌలానా మసూద్ అజహర్ సోదరుడు మౌలానా యూసఫ్ అజహర్ ఆధ్వర్యంలో ఈ ట్రెయినింగ్ సెంటర్ నడుస్తోందని చెబుతూ గతంలోని ఫోటోలు వెలుగు చూశాయి.