గాలిలో విమానం.. అనారోగ్యంతో పైలట్ మృతి
న్యూయార్క్: వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతున్న సమయంలోనే ఆ విమానం పైలెట్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఆ తర్వాత విమానంలోనే ప్రాణాలు వదిలాడు. హఠాత్తుగా జరిగిన పరిణామానికి తీవ్ర ఆందోళనకు గురైన కో పైలట్.. ధైర్యం తెచ్చుకుని ఆ విమానాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గత ఆదివారం రాత్రి 11.55 గంటలకు అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం 550 ఫోనిక్స్ నుంచి బోస్టన్కు బయలు దేరింది. అయితే ప్రయాణం మధ్యలోనే పైలెట్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
ఆ వెంటనే ప్రాణాలు కోల్పోవడంతో వెంటనే విమానం బాధ్యతలు పూర్తి స్థాయిలో కో పైలెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సిరాకస్కు చెందిన విమానాశ్రయ అధికారులను సంప్రదించి మెడికల్ ఎమర్జెన్సీ ఉందని, వెంటనే విమానాన్ని దించివేయాలనుకుంటున్నానని, అందుకు అనుమతివ్వాలని కోరాడు.

దీంతోపాటు రన్ వే దగ్గరికి వెంటనే ఎమర్జెన్సీ అంబులెన్స్ను పంపించాలని కోరాడు. ఇందుకు సిరాకస్ అధికారులు అంగీకరించడంతో దానిని సోమవారం ఉదయం 7గంటల ప్రాంతంలో సురక్షితంగా రన్ వేపై దించివేశాడు. అలా దించిన తర్వాతనే పైలెట్ చనిపోయాడని, అందుకే విమానం అత్యవసరంగా దిగిందని, తోటి ప్రయాణీకులకు, సిరాకస్ విమానాశ్రయ అధికారులకు తెలిసింది.
కో పైలెట్ నిర్వహించిన బాధ్యతలను విమానాశ్రయ అధికారులు మెచ్చుకున్నారు. అయితే, అందులోని ప్రయాణీకులు మాత్రం పెద్ద ప్రమాదం నుంచే గట్టెక్కమనుకుంటూ దేవుడ్ని తలచుకున్నారు. ఆ తర్వాత ఎయిర్ బస్ ఏ 320 ద్వారా ప్రయాణీకులను బోస్టన్ నగరానికి తరలించారు. ఇందులో మొత్తం 147మంది ప్రయాణీకులు ఉన్నారు.












Click it and Unblock the Notifications