అమెరికాలో తీవ్ర కలకలం: మిచిగన్ గవర్నర్ కిడ్నాప్కు కుట్ర - 13 మంది అరెస్ట్ - ట్రంప్ వల్లేనంటూ
అగ్రరాజ్యం అమెరికాలో కనీవినీ ఎరుగని సంఘటన చోటుచేసుకుంది. మరో మూడు వారాల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనుండగా.. ప్రజాప్రతినిధుల్ని కిడ్నాప్ చేసేందుకు కొందరు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) ముందుగానే కుట్రను పసిగట్టడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. దీనికి సంబంధించి వివరాలను ఎఫ్బీఐ, న్యాయ విభాగం అధికారులు మీడియాకు వివరించారు.
జగన్ అనుంగులు ఆ డ్రగ్స్ వాడతారు - ముగ్గురికి జైలు ఖాయం - 7కొండలు-7రెడ్లు: రఘురామ మరోబాంబు
ఆమెనే టార్గెట్..
అమెరికా పశ్చిమభాగంలోని మిచిగన్ రాష్ట్రానికి ప్రస్తుతం గ్రెచెన్ విట్మర్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆమె.. ప్రెసిడెంట్ ట్రంప్ విధానాలను ఎండగడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తారు. కరోనా లాక్ డౌన్ విషయంలో ట్రంప్ కు వ్యతిరేకంగా ఇతర రాష్ట్రాల గవర్నర్లను కూడగట్టి చిన్నపాటి ఉద్యమాన్ని సైతం లేవదీశారు. అదే సమయంలో ట్రంప్ అనుకూల అతివాదులు కొందరు తుపాకులతో రోడ్లపైకి వచ్చి.. గవర్నర్ విట్మర్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. తాజాగా కిడ్నాప్ కుట్రలోనూ మిలిటెంట్లు ఆమెనే టార్గెట్ చేసుకోవడం గమనార్హం. ముందుగా..
పక్కాగా స్కెచ్..
‘‘వోల్వరిన్ వాచ్ మెన్'' పేరుతో ఏర్పాటైన ప్రభుత్వ వ్యతిరేక మిలిటెంట్ గ్రూపు.. మిచిగన్ గవర్నర్ గ్రెచెన్ విట్మర్ కిడ్నాప్ కు కుట్ర పన్నిందని ఆ రాష్ట్ర అటార్నీ జనరల్ డానా నాస్సెల్ మీడియాకు తెలిపారు. ముందుగా రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన క్యాపిటల్ భవనంలో అలజడి సృష్టించి, అక్కడున్న ప్రజాప్రతినిధులు, అధికారులను బందీలుగా చేసుకోవాలని ప్లాన్ చేశారని, చివరి నిమిషంలో పథకం మార్చుకుని, గెస్ట్ హౌజ్ భవనంలో గవర్నర్ విట్మర్ ను మాత్రమే అపహరించాలని కుట్ర పన్నినట్లు అటార్నీ వివరించారు. ఇందు కోసం..
200 మందికి శిక్షణ.. 13 మంది అరెస్ట్..
వీలైతే క్యాపిటల్ భవనంపై దాడి లేదంటే గవర్నర్ కిడ్నాప్ పథకాన్ని అమలు చేసేందుకు ‘‘వోల్వరిన్ వాచ్ మెన్'' మిలిటెంట్ గ్రూపు మొత్తం 200 మందికి సాయుధ శిక్షణ ఇచ్చినట్లు ఎఫ్బీఐ దర్యాప్తులో తేలింది. మిలిటెంట్ గ్రూపుతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఇప్పటి వరకు 13 మందిని ఎఫ్బీఐ అరెస్టు చేసింది. ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రదర్శించడంతోపాటు మిచిగన్ లో అల్లర్లు సృష్టించి, శాంతిభద్రతలకు ఆటంకం కలిగించాలన్నదే ఈ గ్రూపు పన్నాగంగా వెల్లడైంది. ఎఫ్బీఐ కుట్రను ఛేదించే నాటికే మిచిగన్ ప్రభుత్వ విభాగంలోని ఉన్నతాదికారులు, పలువురు ప్రజాప్రతినిధుల కదలికలపై ఈ గ్రూపు సభ్యులు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. కాగా,
ట్రంప్ తీరు వల్లే ఈ అరాచకాలు..
తనను కిడ్నాప్ చేసేందుకు మిలిటెంట్ గ్రూపు కుట్ర పన్నిందని, దీనికి సంబంధించి 13 మందిని ఎఫ్బీఐ అరెస్టు చేసిందని వెల్లడైన తర్వాత మిచిగన్ గవర్నర్ గ్రెచెన్ విట్మర్ మీడియాతో మాట్లాడారు. అమెరికాలో ఎన్నడూ లేని విధంగా అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీరు, ఆయన మాటలు.. మిలిటెంట్ గ్రూపులకు ఊతమిచ్చేలా ఉన్నాయని, ఇటీవల జరిగిన డిబేట్లలోనూ ట్రంప్.. మిలిటెంట్ల పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించారని గవర్నర్ విట్మర్ విమర్శించారు. అయితే..
థ్యాంక్స్ చెప్పకుండా తిట్లా?
కిడ్నాప్ కుట్రకు సంబంధించి మిచిగన్ గవర్నర్ వెట్మర్ చేసిన వ్యాఖ్యలను ప్రెసిడెంట్ ట్రంప్ ఖండించారు. ‘‘పరిపాలనలో ఆమె చెత్త విధానాల వల్లే మిచిగన్ లో అలాంటి పరిస్థితి ఏర్పడింది. కుట్రను భగ్నం చేసింది నా ప్రభుత్వ(ఫెడరల్ ప్రభుత్వ) సిబ్బందేనన్న విషయాన్ని ఆమె మర్చిపోతున్నారు. నిజానికి పెను ప్రమాదం నుంచి కాపాడినందుకు ఆమె(గవర్నర్) నాకు థ్యాంక్స్ చెప్పాల్సిందిపోయి, తిట్టడం ఏమాత్రం బాగోలేదు'' అని ట్రంప్ ట్వీట్ చేశారు. మొత్తంగా అధ్యక్ష ఎన్నికల వేళ గవర్నర్ కిడ్నాప్ కుట్ర ఉదంతం రాజకీయ వేడిని ఇంకా పెంచింది.
Recommended Video
చలికాలంలో చైనాకు తడిసిపోయేలా - యాంటీ రేడియేషన్ మిసైల్ 'రుద్రం-1' - డీఆర్డీవో టెస్టు సక్సెస్