అంతర్జాతీయ వేదికపై ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం!
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న మరుసటి రోజే ఒమన్ దేశం కూడా తన అత్యున్నత పౌర పురస్కారంతో ప్రధాని మోదీని గౌరవించడం విశేషం. ప్రధాని మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరి విడతగా ఒమన్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్, ఒమన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ మోదీకి'ఆర్డర్ ఆఫ్ ఒమన్' పురస్కారాన్ని ప్రదానం చేశారు.'ఆర్డర్ ఆఫ్ ఒమన్' అనేది ఒమన్ దేశం విదేశీయులకు ఇచ్చే అత్యంత విశిష్టమైన పౌర పురస్కారం.
బుధవారం ఇథియోపియా దేశం తన అత్యున్నత పురస్కారమైన 'నిషాన్ ఆఫ్ ఇథియోపియా'తో మోదీని గౌరవించగా, 24 గంటలు గడవకముందే ఒమన్ నుంచి కూడా అటువంటి గౌరవమే లభించింది. భారత్ - ఒమన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఈ పర్యటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి 29 అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. ఇటీవల కువైట్ ప్రభుత్వం కూడా 'ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్-కబీర్'తో ఆయనను గౌరవించింది.

పర్యటన ఉద్దేశం
ముస్కాట్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, సాంస్కృతిక రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడమే ప్రధాన లక్ష్యం. బుధవారం ఒమన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది.












Click it and Unblock the Notifications