మోడీ-షరీఫ్ మాట్లాడుకోలేదు: చేయి ఊపి, నవ్వేశారు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్లు కొద్దిదూరం నుంచే చిరునవ్వుతో అభివాదం చేసుకున్నారు. ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక సదస్సులో ఇది కనిపించింది.
ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక సదస్సు నేపథ్యంలో ప్రధాని మోడీ, షరీఫ్ల మధ్య అనధికార సమావేశం ఉండొచ్చనీ, కనీసం కరచాలనమైనా జరగొచ్చని కొద్ది రోజులుగా ఊహాగానాలు వచ్చాయి. చివరికి వీరిద్దరూ పరస్పర అభివాదంతో సరిపెట్టారు.
మంగళవారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమక్షంలో శాంతిపరిరక్షణపై నేతల సదస్సు కోసం ముందుగా ప్రధాని మోడీ సమావేశ మందిరంలోకి వచ్చారు. ఛాంబర్ హాల్లోని బల్లకు కుడివైపు తన స్థానంలో కూర్చున్నారు.
కొద్దిసేపటికి నవాజ్ షరీఫ్ వచ్చారు. బల్లకు ఎడమవైపున కూర్చున్నారు. కాసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుందనగా.. మోడీని చూసిన షరీఫ్ చేయి ఊపి, నవ్వాడు. ప్రతిగా మోడీ చిరునవ్వుతో అభివాదం చేశారు. మోడీ చేయి వూపుతూ అభివాదం చేయగా, షరీఫ్ చిరునవ్వుతో స్పందిస్తూ తల ఊపారు. అయితే, దీనిని కేంద్ర విదేశాంగ శాఖ ఖండించింది.