'ప్రధానమంత్రి నన్ను రేప్ చేశారు': వర్జీనియా గిఫ్రే ఆత్మకథలో సంచలనం!
అమెరికన్ యువతి వర్జీనియా గిఫ్రే, దివంగత కోటీశ్వరుడు జేఫ్రీ ఎప్స్టీన్ నడిపిన సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో చిక్కుకున్న అత్యంత ప్రముఖ బాధితుల్లో ఒకరు. న్యాయం కోసం ఆమె చేసిన సుదీర్ఘ పోరాటం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె మరణాంతరం విడుదలైన ఆమె ఆత్మకథ 'Nobody's Girl: A Memoir of Surviving Abuse and Fighting for Justice' (ఎవరికీ చెందని అమ్మాయి: వేధింపులను తట్టుకుని, న్యాయం కోసం పోరాటం చేసిన జ్ఞాపకం)లో ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలను, ముఖ్యంగా శక్తివంతమైన వ్యక్తుల నుంచి ఎదురైన వేధింపులను వివరంగా పొందుపరిచారు.
ప్రధానమంత్రి వేధింపులు:
వర్జీనియా గిఫ్రే తన పుస్తకంలో చేసిన అత్యంత సంచలనాత్మక ఆరోపణ ఏమిటంటే.. 2002లో ఎప్స్టీన్కు చెందిన ప్రైవేట్ ద్వీపంలో ఒక 'పేరున్న ప్రధానమంత్రి' తనపై అత్యాచారం చేశారని పేర్కొంది. ఆ దాడి సమయంలో ఆమె గొంతు నులిమి తీవ్రమైన మానసిక, శారీరక హింసకు గురిచేశారని ఆమె వివరించారు. నిందితుడు తాను ప్రాణాల కోసం వేడుకుంటుంటే సంతోషించేవాడని ఆమె తెలిపారు. వర్జీనియా తన పుస్తకంలో ఆ ప్రధానమంత్రి పేరును నేరుగా రాయనప్పటికీ.. న్యాయస్థానంలో మాత్రం ఆ వ్యక్తిని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్గా గుర్తించినట్లు సమాచారం. అయితే ఎహుద్ బరాక్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కానీ ఎప్స్టీన్తో తనకు వ్యక్తిగత పరిచయం ఉన్నట్లు మాత్రం అంగీకరించారు.

18 ఏళ్ల వయసులో ఈ ఘటన జరిగిందని చెప్పిన వర్జీనియా గిఫ్రే.. ఆ నాయకుడి వద్దకు తిరిగి పంపవద్దని ఎప్స్టీన్ను వేడుకున్నప్పుడు, "ఎప్పుడో ఒకప్పుడు నువ్వు ఇదంతా భరించక తప్పదు" అని చెప్పి ఎప్స్టీన్ నిరాకరించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతర శక్తివంతమైన వ్యక్తుల రహస్యాలు
తనపై లైంగిక దాడి చేసిన ఇతర శక్తివంతమైన వ్యక్తుల పేర్లను తాను భయంతోనే బహిరంగపరచలేకపోయానని వర్జీనియా గిఫ్రే తన పుస్తకంలో స్పష్టం చేశారు. చట్టపరమైన, ఆర్థిక ప్రతీకార చర్యల ద్వారా ఆ వ్యక్తులు తనను నాశనం చేస్తారని ఆమె భయపడ్డారు. కొంతమంది శక్తిమంతులు న్యాయస్థానంలో దావాలు వేసి బెదిరింపుల ద్వారా తనను భయపెట్టేందుకు ప్రయత్నించారని వర్జీనియా గిఫ్రే తెలిపారు.
ప్రిన్స్ ఆండ్రూతో వివాదం
ఈ ఆత్మకథలో బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూతో ముడిపడిన వివాదాన్ని కూడా వర్జీనియా గిఫ్రే ప్రస్తావించారు. తాను యుక్తవయస్సులో ఉన్నప్పుడు ప్రిన్స్ ఆండ్రూ తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించారు. ప్రిన్స్ ఆండ్రూ ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండించారు. కోర్టులో పోరాడుతున్న సమయంలో ప్రిన్స్ బృందం వారి సహచరులు సోషల్ మీడియాలో తనను ట్రోల్స్ (వేధింపులు) చేస్తూ అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించారని గిఫ్రే వెల్లడించారు.
పుస్తకం లక్ష్యం:
అక్టోబర్ 21న విడుదలైన ఈ 400 పేజీల ఆత్మకథ కేవలం వేధింపుల కథనం మాత్రమే కాదు. ఇది వేధింపులకు గురైన బాధితులకు ఒక గొంతుగా నిలిచేందుకు, సమాజంలో అవగాహన పెంచడానికి, న్యాయం కోసం ఆమె చేసిన అలుపెరగని ధైర్యసాహసాల పోరాటాన్ని తెలియజేస్తుంది. తనపై జరిగిన హింస (గొంతు నులమడం, కొట్టడం, రక్తస్రావం) గురించి గిఫ్రే వివరంగా రాశారు.












Click it and Unblock the Notifications