ట్రంప్ కొత్త వలస చట్టంలో అసలేముంది?: ఇరాక్కు మినహాయింపు ఎందుకిచ్చారు?
ఇరాక్లో తనిఖీలు, వీసా స్క్రీనింగ్, డేటా షేరింగ్పై ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వంతో మాట్లాడినట్లుగా అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ పేర్కొన్నారు.
వాషింగ్టన్: 'ట్రావెల్ బ్యాన్' నిర్ణయంపై ఫెడరల్ కోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దానికి కొన్ని సవరణలు జతచేసి మరోసారి దాన్ని తెరపైకి తీసుకురావాలనే యోచనలో ఉన్నారు. తాజా 'ట్రావెల్ బ్యాన్' చట్టం నుంచి ఇరాక్ కు మినహాయింపు లభించినట్లు లీకులు వచ్చిన.. కొత్త చట్టంలో ఏముందనే దానిపై పూర్తి వివరాలు ఇంతవరకు బయటకు రాలేదు.
ట్రంప్ కీలక నిర్ణయం.. మరో 'వలస చట్టం'.. ఇరాక్కు ఊరట
ఈ నేపథ్యంలో తాజాగా కొత్త వలస చట్టానికి సంబంధించి మరికొన్ని వివరాలు వెలుగుచూశాయి. ఇరాక్ కు ఎందుకు మినహాయింపునిచ్చారు? క్రైస్తవ మైనారిటీలకు ఎంతమేర ప్రాధాన్యతనిచ్చారు? వంటి అంశాలు వీటి ద్వారా వెలుగులోకి వచ్చాయి. అయితే పాత చట్టంతో పోలిస్తే కొత్త చట్టంలోను దాదాపు అవే నిబంధనలను పొందుపరిచినట్లుగా తెలుస్తోంది.
కాగా, తాజా చట్టంలో ఇరాక్ కు మినహాయింపునివ్వడం వెనుక బలమైన కారణమే ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) ఉగ్రవాద సంస్థ పోరులో ఇరాక్ కీలక పాత్ర పోషిస్తుండటం కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు.
ఇరాక్లో తనిఖీలు, వీసా స్క్రీనింగ్, డేటా షేరింగ్పై ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వంతో మాట్లాడినట్లుగా అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఆ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉండడంతోనే నిషేధ జాబితా నుంచి ఇరాక్ను తొలగించినట్టు ఆయన తెలిపారు.
శరణార్థులపై 120రోజుల నిషేధం ఉన్నా.. ఇప్పటికే అనుమతి పొందిన శరణార్థులను మాత్రం దేశంలోకి అనుమతిస్తారు. అయితే ఏటా కేవలం 50వేల మందికే మాత్రమే దీని ద్వారా అనుమతి లభించనుంది. ఇక సిరియా శరణార్థులపై గతంలో విధించిన నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేసినట్లుగా చెబుతున్నారు.
నిషేధం విధించిన దేశాల పౌరులకు అమెరికాలో ఇప్పటికే గ్రీన్ కార్డు ఉండి ఉంటే వారిని దేశంలో ఉండేందుకు అనుమతిస్తారు. సిరియాపై నిషేధం ఎత్తివేసినా అక్కడి నుంచి వచ్చే క్రైస్తవ శరణార్థులకు కొత్త చట్టంలో ప్రాధాన్యత ఇవ్వలేదని చెబుతున్నారు. కాగా, ఈ కొత్త చట్టాన్ని సైతం కోర్టులో సవాల్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.