భారత్పై ఇస్లామిక్ కోఆపరేషన్ ఘాటు వ్యాఖ్యలు: కేంద్రం ఎదురుదాడి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన నాయకురాలు నుపుర్ శర్మ.. మహ్మద్ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యల పట్ల అరబ్ దేశాలు ఈ వ్యాఖ్యలకు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్నాయి. తమ నిరసనలను తెలియజేస్తోన్నాయి. తమ దేశాల్లోని భారత రాయబారులు, హైకమిషనర్లకు సమన్లను జారీ చేశాయి. వారి నుంచి వివరణ కోరాయి. అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యల పట్ల దేశం తరఫున వివరణలను కోరుతున్నాయి.
ఓఐసీ అభ్యంతరం..
ఇదే అంశంపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ జనరల్ సెక్రెటేరియట్ స్పందించింది. భారత్పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు భారత ప్రభుత్వ అజెండాను బట్టబయలు చేసిందని పేర్కొంది. భారత ప్రభుత్వ సంకుచిత మనస్తత్వానికి అద్దం పట్టిందని, అవాంఛనీయ పరిస్థితులకు దారి తీయడానికి కారణమైందని ఆరోపించింది. మహ్మద్ ప్రవక్త పట్ల అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని స్పష్టం చేసింది.
తప్పుపట్టిన విదేశాంగ శాఖ..
ఇస్లామిక్ కోఆపరేషన్ జనరల్ సెక్రెటేరియట్.. భారత్పై విమర్శలు చేయడాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తప్పుపట్టింది. భారత్ను తప్పు పడుతూ ఓఐసీ వ్యాఖ్యలు చేసిందనే విషయం మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని, వాటిని స్వాగతించడం గానీ, సమర్థించడం గానీ చేయట్లేదని పేర్కొంది. భారత్లో అన్ని మతాలు సమానమేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తేల్చి చెప్పారు. సామాజిక అశాంతికి తావు లేదని అన్నారు.
వారిపై చర్యలు కూడా..
మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారి పట్ల కఠిన చర్యలు కూడా తీసుకున్నారనే విషయాన్ని అరిందమ్ బాగ్చీ గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమైనవే తప్ప.. వాటితో భారత ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. ఓఐసీ జనరల్ సెక్రెటేరియట్.. భారత్పై వ్యాఖ్యలు చేయడం సహేతుకం కాదని అన్నారు. భారత్ను మతపరమైన దృష్టితో చూడటాన్ని మానుకోవాలని తాను ఓఐసీకి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. అన్ని మతాలు భారత్లో సమానమేననే విషయాన్ని తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు.
గల్ఫ్ దేశాలు మండిపాటు..
నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల పట్ల ఖతర్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఒమన్ అధినేత షేక్ అల్-ఖలీలీ మరో అడుగు ముందుకేశారు. బీజేపీ నేతలు మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను.. ముస్లిం సమాజంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. భారతీయ ఉత్పత్తుల బహిష్కరణకు సైతం పిలుపునిచ్చాయంటే ఆయా దేశాల్లో ఈ వ్యాఖ్యల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.