మోడీతో భేటీ: 'జుకర్! నీ చేతికంటిన నెత్తురు కడుక్కో'
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్కు పలువురు శానిటైజర్ బాటిళ్లు పంపించారు. ప్రధాని మోడీతో భేటీ నేపథ్యంలో నీ చేతులు కడుక్కోమంటూ వాటిని పంపించారు.
ప్రధాని మోడిని కలిసిన జుకర్ బర్గ్ చేతులు రక్తంతో తడిశాయని వాటిని కడుక్కునేందుకు శానిటైజర్ బాటిల్స్ పంపాలని 'అలయన్స్ ఫర్ జస్టిస్ అండ్ అకౌంటబిలిటీ' కార్యకర్తలు ప్రచారం ప్రారంభించారు.
గుజరాత్లో సంభవించిన గోద్రా అల్లర్ల నేపథ్యంలో... మోడీతో భేటీ అయిన జుకెర్ బర్గ్కు ఆ రక్తం మరకలు అంటాయని, అతని చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్ బాటిల్స్ పంపాలని ప్రజలను కోరారు. ఇప్పటికే 250 శానిటైజర్ బాటిల్స్ పంపినట్టు వారు వెల్లడించారు.
భారత్, పాకిస్తాన్ ప్రధానులు నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్ అమెరికా పర్యటనలో... ఒకే హోటల్లో బస చేశారు. అయితే, వారు మాట్లాడుకోలేదు. కానీ శాంతి పరిరక్షణపై అమెరికా అధ్యక్షుడు ఒబామా చేసిన ప్రసంగానికి మోడీ, షరీఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట కలవలేదు. కానీ చేతులు ఊపుకున్నారు.
బరాక్ ఒబామా ప్రసంగానికి మోడీ ముందుగా హాజరయ్యారు. కొద్ది నిమిషాలకే షరీఫ్ కూడా వచ్చారు. ఇక మోడీని చూసిన షరీఫ్ చేయి ఊపారు. మోడీ కూడా చేయి ఊపి నవ్వారు. షరీఫ్ కూడా ఓ నవ్వు నవ్వారు. ఇరువురూ సమావేశ అనంతరం ఎవరి దారినా వారు వెళ్లిపోయారు.