ఉక్రెయిన్పై పుతిన్ సీరియస్ : శాంతి చర్చలకు మేము సిద్ధమే..! అడ్డుపడుతుంది వాళ్లే !?.
రష్యా దాడులతో ఉక్రెయిన్ దద్దరిల్లుతోంది. బాంబుల శబ్ధాలతో జనం వణికిపోతున్నారు. ఒక్కో పట్టణాన్ని కైవసం చేసుకుంటూ రష్యా సేనలు విధ్యంసం సృష్టిస్తున్నాయి. పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతోంది. సైనిక చర్యలు చేపట్టి మూడు వారాలు దాటినా యుద్దంలో పూర్తి స్థాయిలో రష్యా సేనలు పట్టు సాధించలేకపోతున్నాయి. రష్యా బలగాలను ఉక్రెయిన్ సేనలు దీటుగానే ప్రతిఘటిస్తున్నాయి. ఉక్రెయిన్-రష్యా మధ్య ఇప్పటికే పలుమార్లు శాంతి చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి కన్పించలేదు .
చర్చలను నిలిపేస్తోంది ఉక్రెయిన్ అధికారులే..
శాంతి చర్చల్లో పురోగతి లేకపోవడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు శాంతి చర్చలను ముందుకు సాగకుండా నిలిపివేస్తోంది ఉక్రెయిన్ అధికారులే అని ఆరోపించారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్తో పుతిన్ మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సంక్షోభానికి సరైన సరైన పరిష్కార మార్గాల అన్వేషణకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. శాంతి చర్చల్లో ఉక్రెయిన్ అధికారుల అవాస్తవ ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నారని ఆరోపించారు.
కాల్పుల విరమణ ప్రకటించండి..
అటు చర్చలను నిలిపివేయడానికి ఉక్రెయిన్ అన్ని విధాలుగా ప్రత్నిస్తున్నట్లు తాము గుర్తిస్తున్నట్లు పుతిన్ తెలిపారు. తాము శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నామని.. ప్రయత్నాలను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్లో కాల్పులకు విరమణ ప్రకటించాలని పుతిన్ను జర్మనీ ఛాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్ కోరారు. దౌత్యపరమైన పరిష్కారాన్ని కనుగొనాలని సూచించారు.
రష్యాకు బల్గేరియా షాక్
ఇదిలా ఉండగా.. బల్గేరియా రష్యాకు షాక్ ఇచ్చింది. తమ దేశంలో ఉన్న 10 మంది రష్యాన్ దౌత్యవేత్తలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. ఆ అధికారులు వారి డిప్లమాటిక్ స్టేటస్కు విరుద్ధంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నరనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు బల్గేరియా తెలిపింది. దీనిపై రష్యా తీవ్రంగా మండిపడింది. తాము దీన్ని ప్రతికూల చర్యగానే పరిగణిస్తున్నా.. సరైన బదులు ఇచ్చే హక్కు తమకు ఉందని రష్యా రాయబారి ఎలియోనోరా మిత్రోఫనోవా తెలిపారు.