2.20 గంటలు: వీ పెంగీతో రాజ్నాథ్ చర్చలు, ఏయే అంశాలపై చర్చించారంటే..?
సరిహద్దుల్లో ఉద్రిక్త నెలకొన్న క్రమంలో రష్యాలో భారత్-చైనా రక్షణశాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్- వి పెంగీ పలు అంశాలపై చర్చించారు. వివిధ అంశాలపై వీరిద్దరూ 2.20 గంటలపాటు డిస్కస్ చేశారు. మాస్కోలో షాంఘై సహకార సంస్థ సదస్సుకు రాజ్నాథ్ సింగ్ హాజరైన సంగతి తెలిసిందే. సమావేశం కావాలని వి పెంగీ కోరడంతో.. రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ మేరకు రక్షణశాఖ కార్యాలయం ట్వీట్ చేసింది.
తూర్పు లడాఖ్ ఎల్ఏసీ వద్ద హై టెన్షన్ నెలకొన్న క్రమంలో వీరి భేటీ జరిగింది. ఈ ఏడాది మే నెల నుంచి ఘర్షణ వాతావరణం నెలకొంది. జూన్ 15వ తేదీన గల్వాన్ వ్యాలీ వద్ద భారత్-చైనా బలగాలకు గొడవ జరిగింది. దీంతో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది చనిపోగా.. చైనా నుంచి కూడా సైనికులు చనిపోయారు. కానీ ఆ దేశం ధృవీకరించలేదు. ఇక అప్పటినుంచి మిలిటరీ, రక్షణ, విదేశాంగ ప్రతినిధులు చర్చల ప్రక్రియ జరుగుతూనే ఉంది.
పొంగాంగ్ టీఎస్వో నదీ గుండా భారత్ భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆగస్ట్ 29, 30, 31వ తేదీల్లో చైనా బలగాలు దుందుకుడుగా వ్యవహరించాయి. దీంతో భారత్ కూడా ధీటుగా ప్రతి ఘటించడంతో డ్రాగన్ తోక ముడిచింది. ఈ క్రమంలోనే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 2వ తేదీన రాజ్నాథ్ సింగ్ మాస్కో వచ్చారు. రష్యా రక్షణశాఖ మంత్రితో వివిధ అంశాలపై బుధవారం చర్చించారు. దీంతో శుక్రవారం సమావేశం అవుదామని చైనా.. రక్షణశాఖ మంత్రి నుంచి ప్రతిపాదన వచ్చింది. దీంతో వారిద్దరూ సమావేశమై చర్చించారు. 2.20 గంటలపాటు సున్నితమైన అంశాలపై డిస్కస్ చేశారు.