Ranil Wickremesinghe : శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణస్వీకారం
శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం కాస్తా రాజకీయ సంక్షోభంగా మారిపోయింది. ఇప్పుడు క్షణక్షణం అక్కడ పరిణామాలు మారిపోతున్నాయి. ప్రజాగ్రహంతో అధ్యక్షుడు గోటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. దీంతో దేశ అధ్యక్షుడిగా ప్రధాని విక్రమసింఘేనే బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం మేరకు దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ఇవాళ ప్రధాని రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు.
శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేసినట్లు పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబేవర్ధనా ఇవాళ అధికారికంగా ప్రకటించారు. దేశాన్ని దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన దేశం విడిచి పారిపోయిన రెండు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ముగిసే వరకు ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని స్పీకర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
స్పీకర్ నిర్ణయం నేపథ్యలో రణిల్ విక్రమసింఘే ఇవాళ తాత్కాలిక దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న శాంతి భద్రతల సవాలు పరిష్కరిస్తే తప్ప దేశం గాడిన పడటం కష్టంగా తెలుస్తోంది. దీంతో ఇప్పటికే దేశంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయినా పలు చోట్ల ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రణిల్ విక్రమసింఘే వాటిని ఎలా అడ్డుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ఇందులో ఆయన విఫలమైతే మాత్రం నిరనసకారులు ఆయన్ను కూడా వదిలేలా కనిపించడం లేదు.